కాగజ్ నగర్, వెలుగు: అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి నిజామాబాద్కు ఓ లారీలో పశువులను తరలిస్తున్నారు. శనివారం ఉదయం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గూడెం చింతలమానేపల్లి సమీపంలోని గూడెం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆ లారీని ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో పోలీసులు ఖర్జెల్లి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు లారీని అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని అందులో 33 పశువులు ఉన్నట్లు గుర్తించారు. గూడెం చెక్ పోస్ట్ వద్ద మరో లారీని తనిఖీ చేయగా 39 పశువులు గుర్తించారు. ఈ ఘటనలో 11 మందిపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ జీవన్ తెలిపారు.
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి చెక్ పోస్ట్ వద్ద పశువులను తరలిస్తున్న ఒక కంటెయినర్, వ్యాన్ ను పోలీసులు శనివారం పట్టుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనఖీ చేస్తుండగా కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ కంటైనర్ను చెక్ చేయగా 33 పశువులను తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన అబ్దుల్ ఖాన్, హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అలీలపై కేసు నమోదు చేసినట్టు సీఐ రంజిత్ రావు, ఎస్సైలు చంద్రకుమార్, అశోక్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా చత్తీస్గఢ్ నుంచి కర్నాటకకు వ్యాన్ లో తరలిస్తున్న 9 ఆవులను స్వాధీనం చేసుకొని సయ్యద్ షాబాద్, సయ్యద్ మొయినుద్దీన్ లపై కేసు నమోదు చేశారు.
