బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్లోనూ ఇండియన్ బాక్సర్లు అదరగొట్టారు. తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్, నీతూ.. గేమ్స్లో రెండు మెడల్స్ను ఖాయం చేశారు. బుధవారం జరిగిన మెన్స్ 57 కేజీ క్వార్టర్ ఫైనల్లో హుస్సాముద్దీన్ 4–1తో ట్రైగాయిన్ మార్నింగ్ న్డెవెలో (నమీబియా)పై గెలిచి సెమీస్లోకి ప్రవేశించాడు. దీంతో కనీసం కాంస్య పతకమైనా దక్కుతుంది. 2018 గోల్డ్ కోస్ట్లోనూ ఈ నిజామాబాద్ బాక్సర్ బ్రాంజ్ మెడల్ను సాధించాడు. బౌట్ మొత్తం అద్భుతమైన పంచ్లతో విరుచుకుపడిన ఇండియన్ బాక్సర్.. ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. విమెన్స్ 48 కేజీ క్వార్టర్ఫైనల్లో నీతూ గంగాస్.. ఏబీడీ ద్వారా నీకోల్ క్లైడీ (నార్తర్న్ ఐలాండ్)పై నెగ్గి సెమీస్లోకి వెళ్లింది. దీంతో ఈమెకు కూడా పతకం ఖాయమైంది. తొలి రెండు రౌండ్లలో నీతూ దూకుడుగా పంచ్లు విసరడంతో బౌట్ను ఆపేశారు. గేమ్స్కు ముందు ఐర్లాండ్లో శిక్షణ తీసుకోవడం తనకు బాగా కలిసొచ్చిందని నీతూ వ్యాఖ్యానించింది. 2012లో బాక్సింగ్ను మొదలుపెట్టిన నీతూకు 2019లో భుజం గాయంతో చాలా రోజులు బౌట్కు దూరమైంది.
హాకీలో జోరు..
సెమీస్కు అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇండియా విమెన్స్ హాకీ టీమ్ జూలు విదిల్చింది. పూల్–ఎ లీగ్ మ్యాచ్లో ఇండియా 3–2తో కెనడాపై గెలిచి సెమీస్లోకి ప్రవేశించింది. దీంతో గేమ్స్లో వరుసగా రెండోసారి సెమీస్కు క్వాలిఫై అయ్యింది. ఈ గ్రూప్లో మూడు విజయాలు, ఓ ఓటమితో ఇండియా 9 పాయింట్లు సాధించింది. ఇండియా తరఫున సలీమా టీటె (3వ ని.), నవ్నీత్ కౌర్ (22వ ని.), లాల్రెసియామి (51వ ని.) గోల్స్ చేశారు. బ్రైనీ స్టేయిర్స్ (23వ ని.), హన్నా హుగ్న్ (39వ ని.) కెనడాకు గోల్స్ అందించారు. మెన్స్ పూల్–బిలో ఇండియా 8–0తో కెనడాను చిత్తు చేసింది. ఫలితంగా సెమీస్కు మరింత చేరువైంది. ఇండియా తరఫున హర్మన్ప్రీత్ (7, 54వ ని.), అక్షదీప్ సింగ్ (38, 60వ ని.), అమిత్ రోహిడాస్ (10వ ని.), లలిత్ ఉపాధ్యాయ్ (20వ ని.), గుర్జాంత్ సింగ్ (27వ ని.), మన్దీప్ సింగ్ (58వ ని.) గోల్స్ చేశారు. తొలి రెండు క్వార్టర్స్లో నాలుగు గోల్స్ కొట్టిన ఇండియా.. థర్డ్ క్వార్టర్లో ఒకటి మాత్రమే చేసింది.