సృష్టి చేసిన అనాథ! ..శిశువిహార్లో అనాథగా రెండు నెలల బాబు..

 సృష్టి చేసిన అనాథ! ..శిశువిహార్లో అనాథగా రెండు నెలల బాబు..
  • చంటిబిడ్డను అమ్మినందుకు తల్లిదండ్రులు జైలుకు..
  • శిశువిహార్​లో అనాథగా రెండు నెలల బాబు.. డీఎన్​ఏ టెస్టుల కోసం శాంపిల్స్​ సేకరణ
  • ‘సరోగసీ’ నాటకమాడిన డాక్టర్​ నమ్రత, ఆమె కొడుకు కస్టడీపై నేడు తీర్పు

హైదరాబాద్ సిటీ / పద్మారావునగర్​, వెలుగు: సృష్టి  టెస్ట్​ట్యూబ్​ బేబీ సెంటర్​ ధన దాహానికి రెండు నెలల శిశువు అనాథగా మారిండు. తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రపోవాల్సిన బిడ్డ.. శిశువిహార్‌లో ఆశ్రయం పొందాల్సి వస్తున్నది. జన్మించిన కొద్ది రోజులకే ఆ శిశువును తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేసిన సృష్టి టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్​ నిర్వాహకురాలు డాక్టర్​నమ్రత.. వేరే దంపతులకు ‘సరోగసీ’ సంతానం అంటూ నమ్మించి అప్పగించింది.


ఇటీవల సరోగసీ నాటకం రట్టవడంతో నమ్రత, ఆమె కొడుకుతోపాటు చంటిబిడ్డను అమ్మిన అసోంకు చెందిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. చంటిబిడ్డను రెండురోజుల కింద శిశువిహార్​కు తరలించారు. కాగా, శిశువు తల్లిదండ్రులను గుర్తించేందుకు పోలీసులు డీఎన్‌‌‌‌ఏ పరీక్షలు చేయిస్తున్నారు. బిడ్డను అమ్మిన దంపతుల నుంచి, అదేవిధంగా బిడ్డను తమ ‘సరోగసీ’ బిడ్డగా నమ్మి ఇన్నాళ్లూ ఆలనాపాలన చూసిన దంపతుల నుంచి శాంపిల్స్​ తీసుకొని.. పరీక్షలకు పంపించారు. ఇప్పటికే సృష్టి టెస్ట్​ట్యూబ్​ బేబీ సెంటర్​లో స్వాధీనం చేసుకున్న రికార్డుల ప్రకారం ఆ బాబు అసోంకు చెందిన దంపతుల కొడుకు అని తేల్చారు. చివరగా డీఎన్​ఏ రిపోర్ట్​వస్తేనే అధికారికంగా ధ్రువీకరిస్తామంటున్నారు.

తల్లిదండ్రులు తీసుకోకపోతే దత్తత  

డీఎన్​ఏ పరీక్షల్లో చంటి బిడ్డ అసోంకు చెందిన దంపతుల బిడ్డ అని తేలినా, వారు జైలులో ఉన్నందున వారు వచ్చే వరకు శిశువిహార్​సిబ్బంది సంరక్షణలోనే ఉంటాడు. వారు బయటకు వచ్చిన తర్వాత సంరక్షణ తీసుకుంటామని హామీ ఇస్తే అప్పగిస్తారు. ఒకవేళ వారు పెంచుకోవడానికి అంగీకరించకపోతే శిశువిహార్​లోనే ఉంచుకుని కారా( CARA) గైడ్​లైన్స్​ప్రకారం దత్తతకు ఇస్తారు. ప్రస్తుతం బాబు అమీర్ పేట్ లోని  శిశువిహార్‌‌‌‌లో ఆశ్రయం పొందుతుండగా.. ఆలనాపాలన చూసుకుంటున్నామని, ఆరోగ్యంగానే ఉన్నాడని  ఓ అధికారి తెలిపారు.  

నిందితుల కస్టడీపై నేడు తీర్పు

సృష్టి టెస్ట్​ట్యూబ్​ సెంటర్​ అక్రమాల కేసులో అరెస్టయిన నిందితుల పోలీస్​కస్టడీ పిటిషన్​పై సికింద్రాబాద్​ కోర్టు గురువారం తీర్పు ఇవ్వనుంది. ప్రధాన నిందితులైన డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణ  రిమాండ్​పై జైల్లో ఉన్నారు. సరోగసి, ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా, కొనుగోలు, విక్రయాలు, అనుమతి లేకుండా ఐవీఎఫ్ సెంటర్​ నిర్వహణ..  ఇలా అనేక కోణాల్లో విచారణ చేపట్టేందుకు వారం రోజుల కస్టడీ కోరుతూ నార్త్​ జోన్​ గోపాలపురం పోలీసులు మూడురోజుల కింద సికింద్రాబాద్​ కోర్టులో పిటిషన్​ వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి  గురువారం తీర్పు ఇవ్వనున్నారు. మరోవైపు తమపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొంటూ డాక్టర్ నమ్రత తమ లాయర్లతో బెయిల్​ పిటిషన్​ దాఖలు చేశారు.