- పెద్ద అంబర్పేటలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
- ఆదిబట్లలో స్కూల్ బస్సు ఢీకొని యువకుడు మృతి
అబ్దుల్లాపూర్మెట్/ఇబ్రహీంపట్నం, వెలుగు: ఏపీ కర్నూలు జిల్లాలో కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన మరువకముందే హైదరాబాద్ సిటీలో మరో రెండు ప్రమాదాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో ప్రైవేట్ ట్రావెల్స్బస్సు బోల్తా పడి, పలువురు గాయపడ్డారు. ఆదిబట్ల పరిధిలో స్కూల్బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ–39–యూపీ–1963 నెంబర్ న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు ఉదయం 9 గంటలకు మియాపూర్ నుంచి గుంటూరు బయలుదేరింది.
మార్గమధ్యలో పెద్ద అంబర్పేటఓఆర్ఆర్ కిందకు దిగుతున్న క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో మొత్తం 15 మంది ప్రయాణికులు ఉండగా, అందులో ఆరుగురికి తీవ్రంగా, కొందరికి స్వల్పంగా గాయలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో హయత్నగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. గుంటూరుకు చెందిన షేక్ జహీర్ (20), ఆకుల గాయత్రి (23) , కాస్తిక్ సుభాష్ (23), మౌనిక (26), ప్రత్యూష (26) , వేరా ఆంజనేయ రెడ్డి (63), శ్రీనివాస్ (35) ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యామ్నాయ డ్రైవర్లకు కంచన్బాగ్ డీఆర్డీవో హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ సంఘటనపై రెండు కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ వి. అశోక్రెడ్డి వెల్లడించారు.
స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల సమీపంలోని ఓఆర్ఆర్సర్వీస్రోడ్డులో తుక్కుగూడ నుంచి బొంగ్లూర్ వైపు వెళ్తున్న ఇండస్ వ్యాలీ స్కూల్ బస్సు..ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నర్సింగ్రావ్ పల్లి గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ బండారి వినోద్(22)గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ప్రకాశ్నగర్లో నివాసముండే వినోద్.. ఓ ఈవెంట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిబట్ల సీఐ రవికుమార్తెలిపారు.
