రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ రైతు భూమి కబ్జా పాలవ్వడంతో మనస్తాపానికి గురై.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేస్తుకున్నాడు. మెదక్ జిల్లాలో మరో రైతు అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లి గ్రామానికి చెందిన దుంపల మల్లేశం తనకున్న 30 గుంటల పొలాన్ని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే పంట సాగు పెట్టుబడికి, కుటుంబ పోషణకు నాలుగు లక్షలు అప్పులు చేశాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకునే ముందు మల్లేశం అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడని పోలీసులు తెలిపారు. మల్లేశంకు ముగ్గురు కూతుళ్లు ఉండగా, ఒకరికి వివాహం జరిగింది. మరొకరు దివ్యంగురాలని తెలుస్తోంది.
కబ్జా చేసి.. పొలం దున్నబోతే అడ్డుకుని..
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన గోనుగోప్పుల రాజేందర్ అనే రైతు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. నిజమాబాద్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. రాజేందర్ కుటుంబానికి కాచాపూర్ గ్రామంలో పది గుంటల పొలం ఉంది. దానిని అదే గ్రామానికి చెందిన ఎర్ర బాలయ్య, సాయగౌడ్ అనే ఇద్దరు కబ్జా చేశారు. అక్రమంగా సాయ గౌడ్ పేరు మీదికి రిజిస్ట్రేషన్ కూడా మార్పించుకున్నారు. అయితే బుధవారం రాజేందర్ పొలం దున్నడానికి ట్రాక్టర్తో వెళ్లగా.. సాయగౌడ్ అడ్డుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేందర్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆలస్యంగా గుర్తించిన కుటుంబసభ్యులు అతడిని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడు. దీంతో బిక్కనూర్ పోలీసులకు రాజేందర్ తండ్రి చిన్న బాలరాజు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం..