- బైడెన్ సర్కారులో మనోళ్లు
- ఇద్దరికి కీలక పోస్టులు
- నామినేట్ చేసినట్టు అమెరికా ప్రెసిడెంట్ వెల్లడి
వాషింగ్టన్: బైడెన్ సర్కారులో ఇండియన్ మూలాలున్న మరో ఇద్దరికి కీలక పోస్టులు దక్కనున్నాయి. సివిల్ రైట్స్ అటార్నీగా కోటగల్ కల్పన, సెర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్గా వినయ్ సింగ్ను నామినేట్ చేయనున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ చెప్పారు. సమాన ఉపాధి అవకాశాల కమిషన్ కమిషనర్గా కల్పనను, డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా వినయ్ను నామినేట్ చేస్తున్నట్టు వైట్హౌస్ చెప్పింది. కల్పన తల్లిదండ్రులు ఇండియా నుంచి వలస వెళ్లారు. కోహెన్ మిల్స్టెయిన్లో పార్ట్నర్గా, అదే సంస్థలోని సివిల్ రైట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రాక్టీస్ గ్రూప్ మెంబర్గా, హైరింగ్ అండ్ డైవర్సిటీ కమిటీ కో చైర్పర్సన్గా కల్పన ఉన్నారు. ఇక, సెర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అయిన వినయ్.. ప్రస్తుతం యూఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోని అడ్మినిస్ట్రేటర్కు సీనియర్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు.