బాధితుల సంఖ్య 587, కోలుకుని ఇంటికి వెళ్లినవారు-51
పశ్చిమ గోదావరి జిల్లా: ఏలూరు పట్టణంలో అంతుచిక్కని వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. రెండు రోజుల క్రితం వింతవ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన సుబ్బరావమ్మ(56), చంద్రరావు(50)ను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. విజయవాడలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూశారు. మృతురాలు సుబ్బరావమ్మకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయిందని, మృతుడు చంద్రరావుకు ఊపిరితిత్తుల సమస్య కూడా ఉందని వైద్యులు వెల్లడించారు.
వింత వ్యాధితో బాధపడుతూ ఈనెల 6న శ్రీధర్ (45) మృతి చెందిన విషయం తెలిసిందే. వింత వ్యాధితో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య బుధవారం బాగా తగ్గింది. మధ్యాహ్నం వరకు 18 మంది మూర్ఛ, వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొత్తగా కేసులేమీ రాలేదు. బుధవారం వచ్చిన 18 మందితో కలిసి ఈ సమస్యతో ఆసుపత్రి పాలైన వారి సంఖ్య 587కి చేరింది. ఇందులో 511 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. 43 మంది ఏలూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మెరుగైన వైద్యం కోసం 33 మందిని విజయవాడ తరలించారు. బుధవారం కొత్తగా లంకపేట, ఆముదాల అప్పలస్వామి కాలనీ, భీమడోలు ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసు నమోదైంది. వ్యాధి వ్యాప్తికి కారణాలపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.
for more News