మార్కెట్‌లో కనిపించని రూ.2వేల నోటు

మార్కెట్‌లో కనిపించని రూ.2వేల నోటు

మార్కెట్ లో రూ.2వేల నోట్లు కనిపించడం లేదు. ఆరేళ్ల క్రితం నోట్ల రద్దు చేసినపుడు ఏటీఎంలలో కేవలం రూ.100, రూ.2వేల మాత్రమే వచ్చేవి. రూ.2 నోట్లయితే ఒక్కొక్కరికీ రెండే వచ్చేవి. ఆ రెండింటి కోసం కూడా జనం క్యూలైన్లలో గంటల కొద్దీ నిలబడి తీసుకునేవారు. రూ.2వేల నోట్లు వచ్చిన మొదట్లో అందరి చేతుల్లో మారుతూ క్రేజ్ పెంచుకున్న నోట్లు.. రాను రాను కనిపించకుండానే పోయాయి. భారతీయ రిజర్వ్ బ్యాంకు వార్షిక నివేదిక ప్రకారం రూ.2వేల నోట్ల సరఫరా ఆర్బీఐ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూర్,  నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్, బ్యాంకు నోట్ ప్రెస్ నుంచి జరుగుతోంది. అయితే మోడీ తీసుకొచ్చిన నోట్ల రద్దు ముఖ్య ఉద్దేశాలలో నల్లధనం అన్నింటికన్నా ముఖ్యమైనది. కానీ దానికి విరుద్ధంగా రూ.2వేల నోటును ఉపయోగిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద నోట్ల వల్ల నల్లధనం దాచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. రూ.2వేల నోట్లతో క్యాష్ వాడకం రికార్డు స్థాయికి చేరుకుంది. కానీ 2016తో పోలిస్తే ఇప్పుడు రూ.2వేల నోట్లను వాడే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. 

అయితే మరి ఆ రూ.2వేల నోట్లన్నీ ఏమయ్యాయి..? దీన్ని బట్టి చూస్తే నల్లధనం రూపంలో రూ.2వేల నోట్లు దాచిపెడుతున్నారన్న ఆరోపణల్లో నిజం ఉన్నట్టు కనిపిస్తోంది. 2019లో రూ.2వేల నోట్ల ముద్రణ ఆగిపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణంగా పరిణమిస్తోంది. మరోవైపు ఆర్బీఐ ఈ నోట్లను తీసుకుంటూ... జనాలకు వెనక్కి తిరిగి ఇవ్వకపోవడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ రూ.2వేల నోట్ల ముద్రణ కూడా జరుగుతోందన్న ప్రచారమూ ఎక్కువవుతోంది. దీంతో రూ. 2వేల నోట్లను రద్దు చేయనప్పటికీ ఆర్థిక వ్యవస్థలో క్రమంగా వాటి వాడకాన్ని తగ్గించినట్టు తెలుస్తోంది. రూ.2 వేల నోట్ల స్థానంలో రూ.500 నోట్లను ముద్రిస్తున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో రూ.2వేల నోట్ల అవసరం అంతగా అవసరం లేదని నిపుణులు భావిస్తున్నారు. అయితే మరి రూ.2వేల నోట్లను కేంద్రం రద్దు చేస్తుందా..? లేదంటే కేవలం ముద్రించడం మాత్రమే ఆపివేస్తుందా..? అనేది వేచి చూడాలి.