హైదరాబాద్, వెలుగు: కరోనా సంక్షోభంలోనూ బండ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గతేడాది మే లో కన్నా ఈ ఏడాది మే లో టూవీలర్స్ సేల్స్ 25 శాతం అధికంగా ఉండటం విశేషం. లాక్ డౌన్ కారణంగా ఇన్ కమ్ తగ్గిననప్పటికీ టూ వీలర్స్ విషయంలో ఆ ఎఫెక్ట్ ఏమీ కనిపించ లేదు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తక్కువగా ఉండటంతో పాటు మాస్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణించాలంటే చాలా మంది భయపడతున్నారు. మరో ఆరు నెలల కరోనా ఎఫెక్ట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో చాలా మంది సొంతంగా బైక్ లు కొనుక్కుంటున్నారని డీలర్లు చెబుతున్నారు.
జిల్లాల్లోనే ఎక్కువ..
సాధారణంగా గ్రేటర్ పరిధిలోనే టూ వీలర్స్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం హైదరాబాద్ కన్నా ఇతర జిల్లాల్లో సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో లాక్డౌన్తో మార్చి 22 నుంచి బైక్ లు, కార్ల షో రూమ్ లు బంద్ అయ్యాయి. ఈ నెల 16 వ తేదీ నుంచి మళ్లీ షో రూమ్ లు ఓపెన్ అయ్యాయి. దీంతో అన్ని జిల్లాల్లో బైక్ ల అమ్మకాలు పెరిగాయి. చాలా జిల్లాల్లో బస్సులు నడుస్తున్న భయంతో ప్రయాణికులు ఎక్కటం లేదు. ఆటోలు, ఇతర ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ లో వెళ్లటానికి కూడా ఇష్టపడటం లేదు. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ ప్రయాణం చేయాలంటే బైక్ ల పైనే వెళ్లటం మంచిదని భావిస్తున్నారు. ఈ కారణంగానే గతంలో కన్నా జిల్లాల్లో టూ వీలర్స్ సేల్స్ భారీగా పెరిగాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే టూ వీలర్స్ సంఖ్య 50 లక్షలు దాటింది. చాలా మందికి ఇప్పటికే బండ్లు ఉన్నాయి. పైగా లాక్ డౌన్ కారణంగా సొంతూళ్లకు వెళ్లటం ఇన్ కమ్ తగ్గటంతో గ్రేటర్ లో బైక్ లు అమ్మకాలు జిల్లాల్లో కన్నా తక్కువగా ఉన్నాయి.
ఆన్ లైన్ అమ్మకాలపై దృష్టి
టూ వీలర్స్ సేల్స్ బాగున్నప్పటికీ కార్ల విక్రయాలు మాత్రం పడిపోయాయి. గతేడాది మే తో పోల్చుకుంటే 50 శాతానికి పైగా కార్ల అమ్మకాలు పడిపోయాయి. దీంతో చాలా షో రూమ్స్ ఆన్ లైన్ బాట పట్టాయి. ఆన్ లైన్ లోనే షో రూమ్ వివరాలు, కార్ల వివరాలను పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెస్ట్ డ్రైవింగ్ కోసం ఇంటికే కార్లను పంపిస్తున్నారు. ఆన్ లైన్ లో టెస్ట్ డ్రైవింగ్ ఆప్షన్ టిక్ చేస్తే కారును ఇంటికి పంపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఆన్ లైన్ కార్ల ఎంక్వైరీ పెరిగింది. అందుకు అనుగుణంగా షో రూమ్స్ యాజమాన్యాలు అప్ డేట్ అవుతున్నాయి. టెస్ట్ డ్రైవింగ్ తర్వాత కారు నచ్చితే ఆన్ లైన్ లో కార్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ఆర్టీఏకి పెరిగిన ఆదాయం..
లాక్ డౌన్ కారణంగా ఆర్టీఏ కు ఆదాయం తగ్గినప్పటికీ…ఇప్పుడు మళ్లీ ఆదాయం పెరుగుతోంది. మే 16 నుంచి స్లాట్స్ ఓపెన్ కావటంతో క్రమంగా స్లాట్స్ సంఖ్య పెంచుతున్నారు. లాక్డౌన్ కు ముందు 20 వేల స్లాట్స్ ఓపెన్గా ఉండేవి. ప్రస్తుతం 14. 5 వేల స్లాట్స్ ఓపెన్ చేశారు. రోజు 10 వేల వరకు బుకింగ్స్ అవుతున్నాయి. ప్రారంభంలో రోజుకు కోటిన్నర ఆదాయం రాగా… ప్రస్తుతం రూ. 7. 5 కోట్ల వరకు వస్తుందని అధికారులు చెబుతున్నారు.
టూవీలర్ సేల్స్ బాగున్నయ్..
రాష్ట్రంలో బండ్ల సేల్స్ చాలా బాగున్నాయి. హైదరాబాద్ కన్నా జిల్లాల్లోనే ఎక్కువ అమ్ముడవుతున్నాయి. పబ్లి్క్ ట్రాన్స్పోర్ట్ తక్కువగా ఉండటమే కారణమని మేము భావిస్తున్నాం. ఆన్లైన్ అమ్మకాలపై దృష్టి పెట్టాం. సిటిలో ఆన్లైన్ ఎంక్వైరీస్ బాగా పెరిగాయి. కస్టమర్ షో రూమ్ కు రాకుండానే ఇంటికే టెస్ట్ డ్రైవ్ కార్లను పంపిస్తున్నాం. నచ్చితే తర్వాత బుక్ చేసుకోవచ్చు. జూన్ నుంచి సేల్స్ ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం.