- రెండు నివాస సముదాయాలపై మిస్సైల్స్ దాడి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా సేనలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఆదివారం ఉదయం క్షిపణులతో రెండు నివాస సముదాయాలను నేలమట్టం చేశాయి. ఈ విషయాన్ని కీవ్ మేయర్ విటాలి క్లిచ్స్కో వెల్లడించారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని ఉక్రెయిన్ బలగాలు కాపాడాయి. నలుగురు స్థానికులు తీవ్రంగా గాయపడగా అధికారులు వారిని హాస్పిటల్కు తరలించారు. గాయపడ్డవారిలో ఏడేండ్ల చిన్నారి కూడా ఉంది. ఆదివారం ఉదయం రష్యా14 మిస్సైల్స్ను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సియ్ తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్పై యుద్ధాన్ని మరింత కాలం కొనసాగించేందుకు రష్యా తన క్షిపణులను బెలారస్కు భారీగా తరలించే ఏర్పాట్లు చేస్తున్నది. రష్యాకు దీటుగా ఉక్రెయిన్ సేనలు కూడా ముందుకు కదులుతున్నాయి. రష్యా తీరును అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఖండించారు. జర్మనీలో జరుగుతున్న జీ 7 సమ్మిట్లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. రష్యా చర్య అనాగరికం అని మండిపడ్డారు.