
న్యూఢిల్లీ: అల్ట్రాటెక్ సిమెంట్ ఈ ఏడాది జూన్తో ముగిసిన మొదటి క్వార్టర్లో రూ. 2,220.91 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది. గత సంవత్సరం ఇదే కాలానికి రూ. 1,493.45 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిందని ఆదిత్య బిర్లా గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం రూ. 21,275.45 కోట్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ. 18,818.56 కోట్లు వచ్చాయి. దక్షిణాదికి చెందిన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, వండర్ వాల్కేర్, యూఏఈకి చెందిన రాక్విట్కంపెనీ కొనుగోలు కారణంగా ఈసారి ఫలితాలు పోల్చదగినవి కాదని కంపెనీ తెలిపింది.
అంతేకాకుండా, కేశోరామ్ ఇండస్ట్రీస్ సిమెంట్ వ్యాపారాన్ని అల్ట్రాటెక్, వాటి సంబంధిత షేర్హోల్డర్లతో, క్రెడిటార్లతో విలీనం చేసే పథకం కూడా మార్చి 1, 2025 నుంచి అమలులోకి వచ్చింది. కంపెనీ అమ్మకాల వాల్యూమ్లు (కన్సాలిడేటెడ్) ఈ క్వార్టర్లో 36.83 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, కేశోరామ్ ఇండస్ట్రీస్ సిమెంట్ వ్యాపారం కొనుగోలుతో ఇవి 9.7 శాతం పెరిగాయి. ఈ కొనుగోళ్లతోపాటు బ్రౌన్ఫీల్డ్ విస్తరణలతో, అల్ట్రాటెక్ తన గ్రే సిమెంట్ సామర్థ్యాన్ని సంవత్సరానికి 192.26 మిలియన్ టన్నులకు (ఎంటీపీఏ) పెంచింది.
ఖర్చులు రూ. 18,405 కోట్లు
ఈసారి జూన్ క్వార్టర్లో కంపెనీ మొత్తం ఖర్చులు రూ. 18,405.19 కోట్లుగా ఉన్నాయి. మొత్తం ఆదాయం, ఇతర ఆదాయాలతో కలిపి రూ.21,455.68 కోట్లుగా ఉంది. ఇంధన ధరలు తగ్గడం వల్ల దాని ఇంధన ఖర్చులు ఏడాది లెక్కన 12 శాతం తగ్గాయి. ముడి పదార్థాల ఖర్చులు స్వల్పంగా 2 శాతం పెరిగాయి. ఇండియా సిమెంట్స్ ఇబిటా రూ. 92 కోట్లు ఉంది. గత ఏడాది దీనికి రూ. 9 కోట్ల నష్టం వచ్చింది.
ఉత్తర ప్రాంతంలోని ఇండియా సిమెంట్స్ ఆస్తుల నుంచి 0.3 ఎంటీపీఏ అదనపు సామర్థ్యం తోడయింది. జూన్ క్వార్టర్లో, అల్ట్రాటెక్ 12 మెగావాట్ల వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్స్ (డబ్ల్యూహెచ్ఆర్ఎస్) సామర్థ్యాన్ని ప్రారంభించింది. దీనితో కంపెనీ మొత్తం డబ్ల్యూహెచ్ఆర్ఎస్ సామర్థ్యం 363 మెగావాట్లకు పెరిగింది. గ్రీన్ పవర్ వాటా 39.5 శాతానికి చేరింది. అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు సోమవారం బీఎస్ఈలో 0.49 శాతం పెరిగి రూ.12,560 వద్ద స్థిరపడ్డాయి.