
జాగ్రెబ్: ఇండియా స్టార్, వరల్డ్ చాంపియన్ డి.గుకేశ్ చేతిలో వరుసగా రెండోసారి ఓడిపోయిన తర్వాత నార్వే లెజెండ్, వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ డీలా పడ్డట్టున్నాడు. ప్రస్తుతం తాను ఆటను అస్సలు ఆస్వాదించడం లేదంటున్నాడు. ఇది వరకు పలుమార్లు తనను తాను వీక్ ప్లేయర్గా పేర్కొన్న మాగ్నస్.. గుకేశ్ చేతిలో ఎదురుదెబ్బల తర్వాత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం జరిగిన సూపర్ యునైటెడ్ రాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్లో ఆరో రౌండ్లో 19 ఏండ్ల గుకేశ్.. ర్యాపిడ్ ఫార్మాట్లో మాగ్నస్ను ఓడించాడు. నెల రోజుల క్రితం నార్వే చెస్ టోర్నమెంట్లో క్లాసికల్ ఫార్మాట్లో గుకేశ్ అతడిని ఓడించి సంచలనం సృష్టించాడు.
నాటి మ్యాచ్లో కార్ల్సన్ నిరాశతో టేబుల్పై కొట్టడం చర్చనీయాంశమైంది. ‘నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను చెస్ ఆడటాన్ని అస్సలు ఆనందించడం లేదు. గేమ్ ఆడుతున్నప్పుడు అంతగా లయ దొరకడం లేదు. నిరంతరం ఇబ్బంది పడుతున్నా. ప్రస్తుతం నా ఆట చాలా చెత్తగా ఉంది’ అని గుకేశ్ చేతిలో ఓటమి తర్వాత కార్ల్సన్ చెప్పాడు. అదే సమయంలో గుకేశ్పై మాగ్నస్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘తను ఇప్పుడు ఈ ఫార్మాట్లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ టోర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాలి. కానీ, వరుసగా ఐదు గేమ్స్ గెలవడం మాత్రం మామూలు విషయం కాదు. నేనైతే టోర్నమెంట్ అంతా చెత్తగా ఆడాను. కాబట్టి తగిన శిక్ష పడింది’ అని పేర్కొన్నాడు.
తనను ఓడించే క్రమంలో గుకేశ్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని మాగ్నస్ చెప్పాడు. అదే సమయంలో తెల్లపావులతో ఆడిన తాను ఒకానొక దశలో గెలుపు ఆశను పూర్తిగా కోల్పోయి ఓడిపోయానని అంగీకరించాడు. ‘ఒక దశలో నాకు డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ నేను ఆడుతూనే ఉండాలని అనుకున్నా. ఆపై కొన్ని ఎత్తుల తర్వాత నేను దాదాపుగా ఆశ లేకుండా ఓడిపోయాను. నేను సరిగ్గా ఆడకపోయినప్పటికీ ఈ క్రెడిట్ మాత్రం గుకేశ్దే. తను బాగా ఆడుతున్నాడు. తన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు’ అని కార్ల్సన్ చెప్పుకొచ్చాడు.