
ఒక్కపూట భోజనం పెట్టి చదువు చెప్పిస్తే మంచి ఉద్యోగం సాధించి ప్రజలకు సేవ చేస్తామని విద్యార్థులు మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ ఉన్న తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ లో కోచింగ్ తీసుకున్న విద్యార్థుల కాల పరిమితి ముగియడంతో హాస్టల్ ఖాళీ చేయాలని, అధికారులు తరగతి గదులకు, వంటగదికి తాళం చేశారు. దీంతో విద్యార్థులు తిండి లేకుండా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే గ్రూప్ 2, ఇతర పేపర్లు లీకేజ్ కావడం వల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ పరీక్షలు పూర్తయ్యే వరకు హాస్టల్లో సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు కోరారు.
జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం విద్యార్థులకు మద్దతు తెలిపి.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 3 రోజులుగా జనసేన పార్టీ తరఫున విద్యార్థులకు, అండగా ఉండి వారికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నామని వెల్లడించారాయన. బంగారు తెలంగాణలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఎల్బీనగర్ జనసేన పార్టీ కోఆర్డినేటర్ పొన్నూరు శిరీష అన్నారు. అధికారులు వెంటనే విద్యార్థులకు, ఆహారంతో పాటు, చదువుకోడానికి బుక్స్, ఇతర సౌకర్యాలను ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకువెళ్లామని.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారామె. తమకు మద్దతుగా నిలిచిన జనసేన పార్టీకి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.