రామప్పకు యునెస్కో బృందం

రామప్పకు యునెస్కో బృందం

    రాష్ట్రంలో వచ్చే వారం పర్యటన

న్యూఢిల్లీ, వెలుగు: రామప్ప ఆలయాన్ని పరిశీలించేందుకు యూనెస్కో బృందం వచ్చేవారం రాష్ర్టానికి రానుందని పర్యాటక శాఖ ఇన్​చార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నేతృత్వంలో జరిగిన ‘పర్యాటక మంత్రుల జాతీయ సమావేశానికి’ పార్థసారథి, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ గుర్తింపు రేసులో రామప్ప తుది దశలో ఉందని చెప్పారు. యునైటెడ్​నేషన్స్ ఎడ్యుకేషన్‍, సైన్స్, కల్చరల్​ఆర్గనైజేషన్‍(యునెస్కో) బృందం రామప్పను వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చే దిశలో పరిశీలన జరపనుందని వివరించారు.

పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను తెలంగాణ రాష్ట్రం విరివిగా ఉపయోగించుకుంటోందన్నారు. ఎకో టూరిజం, ట్రైబల్ టూరిజానికి సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయని, హైదరాబాద్ లో చేపట్టిన హెరిటేజ్ టూరిజం పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. జోగులాంబ ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్​లో చేర్చిన కేంద్రం, అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలన్నారు. ఏటా లక్ష్యాలను రూపొందించుకొని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతోందని చెప్పారు. టూరిజం అభివృద్ధి, విస్తరణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కేంద్ర పర్యాటక శాఖ యోచిస్తోందని, దేశంలోనే ప్రత్యేకంగా నిలిచిన ‘టీహబ్’ సేవలను పరిశీలించాలని కోరారు.