- స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలంటున్న జనం
- మరిన్ని రాయితీలు కోరుతున్న ఇండస్ట్రీలు
న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో కొత్త బడ్జెట్ రానుంది. దీనిపై అన్ని వర్గాలూ ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈసారి మరిన్ని సంస్కరణలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. విధానాల్లో సరళత, స్థిరత్వం, రోజువారీ ఖర్చుల తగ్గింపు, ఆరోగ్యం, జీవనశైలి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పరిశ్రమలు కోరుతున్నాయి. పన్ను చెల్లింపుదారులతోపాటు ఫిట్ నెస్, హాస్పిటాలిటీ, జ్యువెలరీ సంస్థలు, ఎన్బీఎఫ్సీలు కేంద్రానికి చేస్తున్న రిక్వెస్టులు ఇలా ఉన్నాయి..
ట్యాక్స్ పేయర్లు:
గత ఏడాది ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షలకు పెంచారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఉపశమనం పొందిన ట్యాక్స్పేయర్లు ఈసారి కూడా పన్ను తగ్గింపులను ఆశిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త ఐటీ చట్టం అమలులోకి వస్తున్నది. పాత పన్ను విధానం నుంచి తక్కువ పన్ను రేట్లు ఉండే కొత్త విధానానికి మారేందుకు స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఎన్బీఎఫ్సీలు :
గ్రామీణ, అల్పాదాయ వర్గాలకు రుణ సదుపాయం పెంచడంపై బడ్జెట్ దృష్టి పెట్టాలని ముత్తూట్ ఫిన్కార్ప్ సీఈఓ షాజీ వర్గీస్ అన్నారు. గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలకు బ్రాంచ్ల ఏర్పాటు నిబంధనలను సడలించాలని, సర్ఫేసీ చట్టం అమలులో బ్యాంకుల మాదిరే ఎన్బీఎఫ్సీలనూ చూడాలని పేర్కొన్నారు. డిఫాల్టర్లు అయిన వారిని తిరిగి అధికారిక క్రెడిట్సిస్టమ్లోకి తీసుకువచ్చేలా పథకాలు ఉండాలని వర్గీస్ అన్నారు.
పెయింట్స్:
ఈ రంగం హౌసింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై ఆధారపడి ఉంటుందని, రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలపై పెట్టుబడులు పెరిగితే పెయింట్స్కు గిరాకీ అధికమవుతుందని షాలిమార్ పెయింట్స్ సీఈఓ కుల్దీప్ రైనా తెలిపారు. టైటానియం డయాక్సైడ్, రెసిన్లు, పిగ్మెంట్ల వంటి ముడి పదార్థాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలని కోరారు. ఇంటి యజమానులకు పన్ను మినహాయింపులు ఇస్తే పెయింటింగ్ వేయించే కాలపరిమితి తగ్గుతుందని, ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుందని వివరించారు.
రత్నాలు, ఆభరణాలు:
డిజిటల్ గోల్డ్పై స్పష్టమైన నియంత్రణలను, విధానాలను ఈ రంగం కోరుతోంది. వినియోగదారుల రక్షణ కోసం దీనిపై కచ్చితమైన నిబంధనలు ఉండాలని జాయ్ అలుక్కాస్ ఎండీ పాల్ అలుక్కాస్ అన్నారు. సహజ వజ్రాలు, ల్యాబ్లో తయారు చేసిన వజ్రాలకు తేడాను బీఐఎస్ వివరించాలని సూచించారు. స్థిరత్వం, ముందుచూపు గల విధానాలు తమ రంగానికి అవసరమని తెలిపారు.
పర్యాటకం:
హోమ్ స్టేలకు గుర్తింపు ఇవ్వాలని, లైసెన్సు ప్రక్రియ సులభతరం చేయాలని ఎకో స్టే కోరింది. మ్యాన్ మేడ్ ఫైబర్, పాలిమర్లతో తయారు చేసే ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించాలని అప్పర్ కేస్ ప్రతినిధులు అన్నారు. ఫుట్వేర్ ఆర్ అండ్ డీకి ప్రాధాన్యం ఇవ్వాలని, బ్రాండ్ బిల్డింగ్, మేధో సంపత్తి (ఐపీ) విధానాలను సరళంగా మార్చాలని సూచించారు.
ప్రజల వద్ద ఖర్చు చేయడానికి వీలుగా ఆదాయం మిగిలేలా బడ్జెట్ లో చర్యలు ఉండాలి. దీనివల్ల రిటైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాల్లో మేక్ ఇన్ ఇండియాకు మరింత మద్దతు ఇవ్వాలి.
- రేమండ్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియా
