
ఢిల్లీ : పౌరసత్వ బిల్లు సవరణకు కేంద్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పౌరసత్వ బిల్లు సవరణపై హోంమంత్రి అమిత్ షా రెండు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులతో సంప్రదింపులు చేపట్టారు. బిల్లుపై ఉన్న వివాదాలు, సందేహాలను చర్చించారు. ఈ సమావేశం ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగగా.. మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పౌరసత్వ బిల్లుతో పాటు వచ్చే ఏడాది జనవరి 25తో ముగియనున్న చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్లకు పొడిగించే నిర్ణయానికి గ్రీన్సిగ్నల్ లభించింది. ఈ క్రమంలోనే పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016కు కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. మంత్రిమండలి ఆమోద ముద్ర లభించడంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే హోంమంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.