16వ లోక్ సభను రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫారసు చేసింది కేంద్ర కేబినెట్. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్… 16వ లోక్ సభను రద్దు చేస్తూ తీర్మానం ఆమోదించింది. ప్రధాని మోడీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలసి తీర్మానం ప్రతిని అందజేయనున్నారు. తర్వాత లోక్ సభను రద్దు చేస్తారు రాష్ట్రపతి. అయితే కేబినెట్ సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరుకాలేదు. అనారోగ్యం కారణంగా ఆయన రాలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత లోక్ సభకు జూన్ 3 వరకు గడువు ఉంది. ఇప్పటికే ఫలితాలు తేలడంతో మెజార్టీ సాధించిన బీజేపీ… ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటోంది. జూన్ 3లోపు…. 17వ లోక్ సభ కొలువుదీరాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన సభ్యుల లిస్టును ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లు ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రపతికి సమర్పించనున్నారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అధికారిక ప్రక్రియ మొదలవుతుంది.
ఎల్లుండి బీజేపీ పార్టమెంటరీ భేటీ జరగనుంది. ఈసమావేశంలో మోడీని లోక్ సభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. తర్వాత ఈనెల 28న…. మోడీ వారణాసి వెళ్లనున్నారు. 29న గాంధీనగర్ వెళ్లి తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈనెల 30న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.