
కరకట్ (బిహార్): పాకిస్తాన్ వద్ద అణుబాంబులున్నాయని కాంగ్రెస్ భయపడుతోందని, పీవోకేను టచ్ చేయొద్దని భయపెడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఇస్తుందని ఆరోపించారు. ఈ ఎన్నికలు విదేశాల్లో వెకేషన్స్ ఎంజాయ్ చేసే రాహుల్గాంధీకి, ఆర్మీ జవాన్లతో దీపావళి జరుపుకునే మోదీకి మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఆదివారం ఆయన బిహార్లోని ససారం, కరకట్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఓ జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో రూ.12 లక్షల కోట్ల కుంభకోణం చేసిన స్కామ్స్టర్లు ఉన్నారని, 23 ఏండ్లలో పీఎంగా, సీఎంగా మోదీపై ఒక్క అవినీతి మరకకూడా లేదని చెప్పారు. రాహుల్ గాంధీలాగా మోదీ ఆగర్భ శ్రీమంతుడుకాదని, ఓ బీసీ కులానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో పుట్టారని, ఓ దశలో చాయ్ కూడా అమ్మారని తెలిపారు. విపక్ష ఇండియా కూటమికి బలమైన నాయకత్వం, వారిలో సహకారభావం లేదని అన్నారు. ఆర్టికల్ 370ని తమ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పీవోకే తమదేనని గట్టిగా చెప్పగులుగుతున్నామని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక భారత్ను ప్రపంచంలోనే మూడో
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుపుతామని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పిస్తాం
జమ్మూకాశ్మీర్లో లోక్సభ ఎన్నికలు విజయవంతంగా ముగియడంపై అమిత్ షా ఆనందం వ్యక్తంచేశారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి మోదీ సర్కారు కాశ్మీర్ విధానాన్ని నిరూపించుకున్నదని చెప్పారు. ఇక్కడ సెప్టెంబర్ 30 లోపు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఎలక్షన్స్ ముగిసిన వెంటే ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు.
మత ఆధారిత ప్రచారం నిర్వహించలేదు
ఈ ఎన్నికల్లో తాము మత ఆధారిత ప్రచారం నిర్వహించలేదని అమిత్ షా వెల్లడించారు. ముస్లింలకు రిజర్వేషన్లపై తాము అసత్యాలు ప్రచారం చేయలేదని, కర్నాటక, ఆంధ్రప్రదేశ్లో జరిగిన దానినే ప్రస్తావించామని చెప్పారు. ఈసారి కచ్చితంగా 400 సీట్లు సాధించి, కేంద్రంలో మూడోసారి అధికారం చేపడుతామని ధీమా వ్యక్తంచేశారు. ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మోదీనే తమ పార్టీకి రియల్ లీడర్ అని చెప్పారు. వచ్చే ఐదేండ్లలో అన్నివర్గాలతో సంప్రదింపులు జరిపి, యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేస్తామని చెప్పారు. అలాగే, వన్ నేషన్, వన్ ఎలక్షన్ను కూడా అమలయ్యేలా చూస్తామని వెల్లడించారు. రాబోయే రెండు, మూడేండ్లలో దేశంలో నక్సల్స్ సమస్య పూర్తిగా సమసిపోతుందని అమిత్ షా చెప్పారు.