
రాజన్నసిరిసిల్ల, వెలుగు : అన్నంలో రాళ్లు వస్తూ, టాయిలెట్లో నీళ్లు రాక స్టూడెంట్లు ఇబ్బందులు పడుతుంటే ప్రిన్సిపాల్స్, ఆఫీసర్లు ఏం చేస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల, కోనరావుపేట మండలం మరిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ స్కూల్స్లో సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం చేస్తున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝూకు సూచించారు.
అత్యంత వెనుకబడిన గిరిజన, ఆదివాసీలకు హైక్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలన్న లక్ష్యంతోనే ప్రధాని మోదీ ఈ స్కూల్స్ను ఏర్పాటు చేశారని చెప్పారు. నవోదయ విద్యాలయాల కంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని 23 ఏకలవ్య మోడల స్కూల్స్లో 8,309 మంది స్టూడెంట్లు ఉన్నారని, ఒక్కో విద్యార్థిపై సగటున ఏటా రూ.1.09 లక్షలు ఖర్చు చేస్తున్నారన్నారు. స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆయన వెంట ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు.