బీజేపీ 370కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తుంది: కిషన్​రెడ్డి

బీజేపీ 370కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తుంది: కిషన్​రెడ్డి

పద్మారావునగర్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్​రెడ్డి చెప్పారు. సోమవారం పద్మారావునగర్​లోని స్వరాజ్​ప్రెస్​నుంచి బీజేపీ విజయ సంకల్ప బస్సు యాత్రను ప్రారంభించారు. ముషీరాబాద్‌ క్రాస్​రోడ్, బన్సీలాల్‌ పేట, సికింద్రాబాద్‌, రసూల్‌ పూర, యూసఫ్​గూడ ప్రాంతాల గుండా యాత్ర సాగింది. బీజేపీ శ్రేణులు మంగళహారతులతో కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్ల కాలంలో దేశంలో ఉద్రవాదుల దాడులు, కిడ్నాప్‌లు లేవన్నారు. జమ్మూ కశ్మీర్‌‌లో శాంతి నెలకొందని, జాతీయ జెండా రెపరెపలాడుతోందన్నారు. దేశ పౌరులందరికీ కరోనా వ్యాక్సిన్​ ఉచితంగా ఇచ్చామని చెప్పారు.

ఫ్రీగా 5 కిలోల బియ్యం ఇస్తున్నామని, ప్రతి పౌరుడికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల వైద్యం అందుబాటులోకి  తెచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 370  సీట్లకు పైగా గెలవబోతుందన్నారు. ప్రతిఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. హిందువుల కలగా మిగిలిన అయోధ్యలోని శ్రీరామాలయాన్ని పున:నిర్మించి, చరిత్రలో నిలిచిపోయిన గొప్ప నేత ప్రధాని మోదీ అన్నారు.  9904119119 నెంబర్‌‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి మోదీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల బీజేపీ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ తీశారు. పలు చోట్ల నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కిషన్​రెడ్డి మాట్లాడారు. యాత్రలో ఎంపీ డా.కె.లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, సికింద్రాబాద్​పార్టీ ప్రెసిడెంట్ శ్యాంసుందర్, పార్లమెంటరీ సెగ్మెంట్ ఇన్‌చార్జి టి.రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు దీపిక, సుచిత్ర, సరళ నాయకులు పాల్గొన్నారు.