తల్లి పాలే బిడ్డకు వైద్యం..మంచి ఆహారం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తల్లి పాలే బిడ్డకు వైద్యం..మంచి ఆహారం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తల్లి పాలు బిడ్డకు అమృతంలాంటివని, పిల్లల ఆరోగ్యమే తల్లులకు మహాభాగ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలోని బాగ్ అంబర్‌పేట్‌లో నిర్వహించిన ‘హెల్తీ బేబీ షో’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో హెల్తీ బేబీ షో కార్యక్రమం నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమను ఆదేశించారని చెప్పారు. 3 నుంచి 13 నెలల పసి పిల్లలతో హెల్తీ బేబీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

పిల్లలను తల్లులు ఎంతో పోటీతత్వంతో పెంచుతున్నారని, ఇది చాలా మంచి పరిణామం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొందరు తల్లులు తమ పిల్లలకు డబ్బా పాలు ఇస్తున్నారని, తల్లి పాలే పిల్లలకు అమృతం అన్నారు. తల్లి పాల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి.. చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రభుత్వం, సమాజం తరపున తల్లి పాలను ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. హెల్తీ బేబీ షో సర్టిఫికెట్ పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా గుర్తుగా ఉంటుందన్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా బాలికల ఆరోగ్యంతో పాటు భ్రూణ హత్యలను సైతం తగ్గించారని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మగపిల్లలతో పాటు ఆడపిల్లల సగటు సంఖ్య పెరిగిందని అన్నారు.