రామాయణ యాత్ర రైలు ప్రారంభం

రామాయణ యాత్ర రైలు ప్రారంభం

రామాయణ సర్క్యూట్ ను కనెక్ట్ చేసే తొలి పర్యాటక రైలు ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి భారత్ గౌరవ్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రామాయణ గాధతో ముడిపడిన ఎన్నో విఖ్యాత ఆలయాలను ఈ రైలు అనుసంధానిస్తుంది. ఇది భారత్, నేపాల్‌లను కలుపుతున్న మొదటి భారత్ గౌరవ్ రైలు. ఈ  రైలు ద్వారా రాముడు నడయాడిన అన్ని ప్రాంతాలను కలుపుతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ నుంచి బయల్దేరి అయోధ్య, నేపాల్, రామేశ్వరం వరకు అనేక ప్రాంతాలను చుట్టి వచ్చి చివర్లో  తెలంగాణకు వెళ్తుందన్నారు. దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం పర్యటించడంతో యాత్ర ముగిసి, తిరిగి ఢిల్లీకి చేరుకుంటుందని చెప్పారు. మొత్తం 18 రోజుల పాటు సాగే ప్రయాణంలో భోజన, వసతి, స్థానిక రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.  బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలు మార్గం తాను మంత్రి కాకముందే ఖరారైందని.. తెలుగు రాష్ట్రాల్లోని బౌద్ధ క్షేత్రాలను కూడా ఇందులో కలపాలన్న ప్రతిపాదన ఉందని చెప్పారు. త్వరలోనే దానిపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

ఎక్కడి నుండి ఎక్కడివరకు

ఇది ఢిల్లీ  నుంచి బయలుదేరి 8వేల  కిలోమీటర్లు ప్రయాణించి నేపాల్ లోని జనక్ పూర్ కు చేరుకుంటుంది. మొత్తం 18 రోజుల టూర్ ప్యాకేజీ విలువ రూ.62వేలు( ఒకరికి).  ఈ టికెట్ ను బుక్ చేసుకొని ఈఎంఐ పై టికెట్ చార్జీని చెల్లించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు.  ఈ ట్రైను లో మొత్తం 600  సీట్లు, 11 ఏసీ త్రీ టైర్ కోచ్ లు ఉన్నాయి. ‘భారత్ గౌరవ్’ రైలు మొదటి స్టాప్ అయోధ్య.  అక్కడ పర్యాటకులు దిగి రామ జన్మభూమి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.  కాగా, తెలంగాణలోని భద్రాచలం, తమిళనాడులోని రామేశ్వరం, హంపి, పంచవటి (నాసిక్), చిత్రకూట్, ప్రయాగ్ రాజ్, వారణాసి, సీతామడి, నందిగ్రామ్, అయోధ్యలను అనుసంధానిస్తూ మరో ప్రత్యేక రూట్ లోనూ ‘భారత్ గౌరవ్’ రైలును నడపనున్నారు.