పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తోంది

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తోంది

బీబీనగర్: ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆమె.. బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఎయిమ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రేడియోగ్రఫీ, అధునాతన అల్ట్రా సోనోగ్రఫీ విభాగాలను ప్రారంభించారు. ఓపీ విభాగంలో రోగులతో ముచ్చటించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను గురించి కేంద్ర మంత్రి ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కను నాటారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆయుష్మాన్ భారత్ పథకంలో దేశ వైద్య రంగంలో పెను మార్పులు జరిగాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. మోడీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎయిమ్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.