అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధ్యులను వదలిపెట్టం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధ్యులను వదలిపెట్టం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

గాంధీనగర్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురువారం (జూన్ 12) గుజరాత్‎లోని అహ్మదాబాద్‎లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోడీ ఆదేశాల మేరకు రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్‎కు వెళ్లారు. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ప్రమాద విషయం తెలియగానే విజయవాడ నుంచి అహ్మదాబాద్ బయలుదేరానని తెలిపారు. ప్రధాని మోడీ తనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారని.. ఈ ఘటన స్థలానికి వెంటనే వెళ్లాలని ఆదేశించారని తెలిపారు. 

విమాన ప్రయాణికుల్లో చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని.. అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మృతుల సంఖ్యను ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. విమాన ప్రమాన బాధ్యులను వదలిపెట్టమని తెలిపారు. కాగా, గుజరాత్‏లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‎లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 

230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో మొత్తం అంటే 242 మంది చనిపోయారు. పైలెట్లు, విమాన సిబ్బంది, ప్రయాణికులు అంతా సజీవ దహనమయ్యారు.