వాషింగ్టన్: భారతదేశ డీఎన్ఏలోనే భిన్నత్వంలో ఏకత్వం, ఐక్యత ఉన్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మోహన్ భగవత్ శనివారం (ఆగస్ట్ 29) న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్లో పొల్గొన్నారు. అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ అనే బృందం నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రవాస భారతీయులు తాము నివసిస్తూ ఉపాధి పొందుతున్న కర్మభూమి పట్ల విధేయతతో ఉండాలని.. అదే సమయంలో తమ జన్మభూమి అందించిన విలువలు, సంప్రదాయాలను కొనసాగించాలని సూచించారు. కర్మభూమి పట్ల బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత జన్మభూమి అయిన భారత్కు ఏదైనా చేయాలనుకుంటే చేయవచ్చని అది తప్పేమీ కాదని స్పష్టం చేశారు.
‘‘మనం అమెరికాలో నివసిస్తున్నాం. ఇక్కడే సంపాదిస్తున్నాం. కాబట్టి మనం అమెరికన్లం. మనం అమెరికా పట్ల నిజాయితీగా ప్రవర్తించాలి. ప్రవాస భారతీయులకు వారి కర్మభూమి పట్ల కర్తవ్యం ఉంది. వారు దానిని నెరవేర్చాలి. వారు తమ కర్మభూమికి విధేయులుగా ఉండాలి. అదే సమయంలో తమ జన్మభూమి అందించిన విలువలు, సంప్రదాయాలను పాటించాలి’’ అని పేర్కొన్నారు.
భిన్నత్వం ఏకత్వంతో కలిసి ఉండగలదని ప్రపంచానికి చూపించాలి:
భిన్నత్వంలో ఏకత్వం భారత్ డీఎన్ఏలో అంతర్లీనంగా ఉందని మోహన్ భగవత్ అన్నారు. అలాగే, భిన్నత్వం ఏకత్వంతో కలిసి ఉండగలదని భారతదేశం ప్రపంచానికి చూపించాలన్నారు. దేశాలు కేవలం భౌగోళిక అస్తిత్వాలు మాత్రమే కావని.. వాటికి సాధించాల్సిన ఒక ఉన్నతమైన లక్ష్యం, నెరవేర్చాల్సిన ఒక గమ్యం ఉంటుందని స్వామి వివేకనంద వ్యాఖ్యలను గుర్తు చేశారు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనగానే బహుళత్వం అనే పదం గుర్తుకు వస్తుంది. అదే ఇండియా విషయానికి వస్తే భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం వర్తిస్తుందని చెప్పారు. భారత్కు ఈ ఏకత్వం, ఈ భిన్నత్వం రెండూ దాని డీఎన్ఏలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
