
- 15 స్టేట్ వర్సిటీల్లో 12 వర్సిటీలకు ఇన్చార్జి వీసీలే దిక్కు
- సిబ్బంది వేతనాలకు కూడా సరిపోని ఫండ్స్
- ఖాళీగా వేలాది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
- కాంట్రాక్ట్, పార్ట్టైం సిబ్బందితోనే బోధన
- కనీస సౌకర్యాలు కరువైన హాస్టళ్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూనివర్సిటీలు ఆగమైపోతున్నాయి. నిధులు, సౌలతులు, ఫ్యాకల్టీ లేక నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. ఓయూతో మొదలు.. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వరకు అన్నిట్లోనూ ఇదే పరిస్థితి. కొత్త యూనివర్సిటీలకు బిల్డింగ్స్ లేవు. అవి పీజీ సెంటర్లను తలపిస్తున్నాయి. పాత యూనివర్సిటీల్లో బిల్డింగ్స్ ఎప్పుడు కూలుతాయో తెలియని దుస్థితి. స్వరాష్ట్రంలోనైనా వర్సిటీలు బాగుపడుతాయని భావించినా.. ఎలాంటి మార్పులేదు. పాత కోర్సులు తప్ప కొత్త కోర్సులు అందుబాటులోకి రావడం లేదు. రీసెర్చ్కు కేంద్రంగా ఉండాల్సిన వర్సిటీల్లో ఇప్పుడు ఆ ముచ్చటే పెద్దగా వినిపించడం లేదు. సమస్యలపై గళమెత్తుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ అంటున్నారు. ఎన్నో ఏండ్లుగా ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయడం లేదని, ఫండ్స్ను మొక్కుబడిగా ఇచ్చి చేతులు దులుపుకుంటోందని వారు మండిపడుతున్నారు. ఇటీవల బడ్జెట్లోనూ అరకొర నిధులతోనే సర్కారు సరిపెట్టింది.
రాష్ట్రంలోకి ప్రైవేటు వర్సిటీలు దూసుకొస్తున్న ప్రస్తుత తరుణంలో వాటికి పోటీగా రాష్ట్ర యూనివర్సిటీలు నిలబడుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 15 స్టేట్ యూనివర్సిటీలున్నాయి. వీటిలో ఆరు కన్వెన్షనల్(సంప్రదాయ) వర్సిటీలు కాగా, 9 స్పెషలైజ్డ్ వర్సిటీలు. వీటిలో ఉస్మానియా వర్సిటీ ఒక్కటే వందేండ్ల కింద ఏర్పడింది. కాకతీయ వర్సిటీ 43 ఏండ్ల క్రితం ఏర్పడింది. 2006, ఆ తర్వాత ఏర్పాటు చేసినవే పది ఉన్నాయి. విద్యాశాఖ పరిధిలో 11 యూనివర్సిటీలుండగా, రెండు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరిధిలో, ఒక్కోటి హెల్త్ డిపార్ట్మెంట్, పశుసంవర్థకశాఖ పరిధిలో కొనసాగుతున్నాయి. కేవలం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, కాళోజీ హెల్త్, జేఎన్ఏఎఫ్ఏయూకి మాత్రమే రెగ్యులర్ వీసీలున్నారు. మిగతా 12 యూనివర్సిటీలకు ఇన్చార్జుల పాలనలో నడుస్తున్నాయి.
ఖాళీలు భర్తీ చేసేదెన్నడో?
విద్యాశాఖ పరిధిలోని 11 వర్సిటీల్లో పది యూనివర్సిటీలు ఇన్చార్జీల పాలనలోనే ఉన్నాయి. దాదాపు 1,650 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2017లోనే 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రొఫెసర్ పోస్టులు 99 ఉండగా, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 270, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 692 ఉన్నాయి. వీటిని ఇప్పటివరకు భర్తీ చేయలేదు. మిగతా4 వర్సిటీల్లోనూ ఇదే దుస్థితి. ఫలితంగా కాంట్రాక్ట్, పార్ట్టైం సిబ్బందితోనే పాఠాలు కొనసాగించాల్సిన పరిస్థితి. వర్సిటీల్లో నియామకాలు చేపట్టకపోవడంతో బోధన, పరిశోధన రంగాలు గాడితప్పి విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వర్సిటీలు సొంత రాష్ట్రంలోనూ నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, గత ఐదేండ్లుగా పాలకులు పట్టించుకోలేదని అంటున్నారు.
బడ్జెట్ అంతంతే
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ వర్సిటీలను పెద్దగా పట్టించుకోలేదు. విద్యాశాఖ పరిధిలోని 11 వర్సిటీలకు రూ. 1,600 కోట్లు కావాలని అడిగితే.. రూ.582 కోట్లతో సరిపెట్టారు. మిగిలిన వర్సిటీలదీ ఇదే పరిస్థితి. ఈ కేటాయింపులు ఏ మూలకూ సరిపోవని వర్సిటీ అధికారులు అంటున్నారు. ఏడాదిలో మూడు, నాలుగు విడతలుగా ప్రభుత్వం కొసరికొసరి విడుదల చేస్తున్న బ్లాక్ గ్రాంట్స్.. సిబ్బంది వేతనాలకే చాలడం లేదని చెబుతున్నారు. నిర్వహణ ఖర్చులకు, కాంట్రాక్ట్, పార్ట్టైం సిబ్బంది వేతనాలకు అంతర్గత వనరుల ద్వారానే నిధులు సమకూర్చుకోవాల్సి వస్తోందని అంటున్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అనుబంధ కాలేజీలు పెద్దగా లేని వర్సిటీలకు ఇతర ఆదాయ వనరులు లేక వేతనాల కోసం ఫస్ట్ తారీఖు రాగానే అధికారులు ఫైనాన్స్ సెక్రటరీ వద్ద క్యూ కట్టాల్సి వస్తోంది.
హాస్టళ్లలో సౌకర్యాలేవి?
వర్సిటీ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఐదేండ్లలో కొత్తగా బిల్డింగ్లు కట్టిన దాఖలాలు లేవు. వందేండ్ల చరిత్ర కలిగిన ఓయూలోనూ ఇప్పటికీ స్టూడెంట్స్ రేకుల షెడ్డులాంటి హాస్టళ్లలోనూ గడపాల్సి వస్తోంది.
కొత్త కోర్సుల ముచ్చటేది?
స్టేట్ వర్సిటీల్లో ఇప్పటికీ సంప్రదాయ కోర్సులే కొనసాగుతున్నాయి. ఈ కోర్సుల్లో చాలావరకు హాస్టల్ వసతి కల్పించే ఫుడ్ కోర్సులుగా మారిపోయాయి. ఈ కోర్సులు చదివి బయటకు వచ్చాక ఉద్యోగావకాలు లభించడం లేదని స్టూడెంట్స్ అంటున్నారు. రాష్ట్రంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో కొత్త కొత్త కోర్సులు పెడుతున్నా.. స్టేట్ యూనివర్సిటీల్లో మాత్రం ఆ ఊసే లేదని చెబుతున్నారు. ఉపాధి మార్గం చూపే కొత్త కోర్సులను తీసుకురావాలని కోరుతున్నారు.
ప్రైవేటు వర్సిటీల తాకిడి
రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో, సర్కారీ స్టేట్ వర్సిటీల మనుగడ ప్రశ్నార్థంగా మారింది. అన్నిహంగులతో రూపుదిద్దుకొనే ప్రైవేట్ యూనివర్సిటీలతో ఇవి పోటీపడి నిలబడుతాయో ? లేదోనన్న సందేహం వ్యక్తమవుతోంది. స్వరాష్ట్రంలోనైనా స్టేట్ యూనివర్సిటీల దశతిరుగుతుందని అందరూ ఆశించారని, ఆ పరిస్థితి కనిపించడం లేదని, ఇప్పటికైనా సర్కారు దృష్టి సారించాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
వీసీల్లేరు..ఈసీల్లేవు
రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండేండ్లకు వర్సిటీలకు వీసీలను నియమించిన టీఆర్ఎస్ సర్కార్.. ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల(ఈసీ)ను ఏర్పాటు చేయలేదు. ఆ వీసీల కాలపరిమితి ముగియడంతో జులై 23న 9 వర్సిటీల వీసీల కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ ఇప్పటికీ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కాలేదు. సెర్చ్ కమిటీలనూ ప్రభుత్వం నియమించలేదు. ఇన్చార్జీ వీసీలుగా ఐఏఎస్ ఆఫీసర్లను నియమించడంతో, వారు డిపార్ట్మెంట్ల బిజీలో ఉండి వర్సిటీల గురించి పట్టించుకోవడం లేదని స్టూడెంట్స్ అంటున్నారు. శాతవాహన వర్సిటీకి నాలుగేండ్లుగా, ఆర్జీయూకేటీకి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇన్చార్జి వీసీలే కొనసాగుతున్నారు.
పైసల్లేకుండా రిసెర్చ్ ఎట్ల..?
యూనివర్సిటీలకు ఇప్పుడు వీసీలు కూడా లేరు. నిధులు కూడా ఇవ్వలేదు. పైసలివ్వకుంటే పనులు ఎలా సాగుతాయి? రీసెర్చ్ ఎలా నడుస్తుంది? దాదాపు అన్ని వర్సిటీల్లోనూ కాంట్రాక్టు పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. ఘనచరిత్ర ఉన్న ఓయూ, కేయూలకు కూడా నిధుల్లేవు. ఇప్పుడు వీసీలను అపాయింట్ చేసినంత మాత్రాన సరిపోదు.. నిధులు కూడా ఇవ్వాలి. – చుక్కా రామయ్య, విద్యావేత్త