బీజింగ్: చైనాలో జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. జిన్పింగ్ సర్కార్ విధించిన కఠినమైన లాక్డౌన్ కారణంగానే ఉరుమ్కీలోని ఓ బిల్డింగ్లో గురువారం 10 మంది సజీవ దహనం అయ్యారని మండిపడ్డారు. మంటలు కంట్రోల్ చేసేందుకు చాలా టైం పట్టిందని విమర్శించారు. షాంఘైలోని ఓ గవర్నమెంట్ ఆఫీస్ ముందు వందలాది మంది ప్రజలు గుమిగూడి ‘‘జిన్పింగ్ స్టెప్డౌన్.. అన్లాక్ చైనా..” అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేను ఉపయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. కొంతమందిని అరెస్టు చేశారు. పలు యూనివర్సిటీ క్యాంపస్లలోనూ స్టూడెంట్లు నిరసన తెలియజేశారు.
దేశవ్యాప్తంగా నిరసనలు
షింజియాంగ్ను అన్లాక్ చేయాలంటూ వీగర్ముస్లింలతో పాటు అనేక మంది హాన్ చైనీయులు డిమాండ్ చేశారు. షింజియాంగ్లో కోటి మంది నివసిస్తున్నారని, ఉరుమ్కీ సిటీలోనే 40లక్షల మంది ఉంటారని తెలిపారు. 3నెలలుగా కఠినమైన లాక్డౌన్ విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఆదుకోవాలని, లాక్డౌన్ ఎత్తేయాలంటూ జాతీయ గీతాన్ని పాడుతూ నిరసన తెలియజేశారు. ఉరుమ్కీలో చనిపోయిన వారికి పూలు, క్యాండిల్స్తో నివాళులు అర్పించారు. ఉరుమ్కీలో చేపట్టిన నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. బీజింగ్ సరిహద్దులోనూ జీరో కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఉరుమ్కీ అధికారులు స్పందించారు. దశలవారీగా లాక్డౌన్ ఎత్తేస్తామని ప్రకటించారు.
40వేల పాజిటివ్ కేసులు నమోదు
శనివారం 39,501 మంది కరోనా బారినపడ్డారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఆదివారం ప్రకటించింది. వీటిలో 35,858 అనుమానిత కేసులుగా నమోదైనట్టు తెలిపింది. దేశమంతటా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని వివరించింది. వరుసగా నాల్గో రోజు రికార్డు స్థాయిలో కేసులు రికార్డయ్యాయి. బీజింగ్లో 4,700 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఆదివారం నాటికి బీజింగ్లో పాజిటివ్ కేసుల సంఖ్య 9,694కు చేరుకున్నాయి. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లోని అపార్ట్మెంట్లు లాక్డౌన్లో ఉన్నాయి. కరోనా గైడ్లైన్స్ పాటించాలంటూ స్టేట్ కౌన్సిల్ జాయింట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మెకానిజం స్థానికులను కోరింది.