భద్రాద్రికొత్తగూడెంలో జాడలేని ఫుడ్ ​ప్రాసెసింగ్ ​యూనిట్

భద్రాద్రికొత్తగూడెంలో జాడలేని ఫుడ్ ​ప్రాసెసింగ్ ​యూనిట్
  • ఏర్పాటుపై గత ప్రభుత్వం హడావుడి
  • రెండేండ్లుగా ప్రపోజల్స్​కే పరిమితం 
  • కాంగ్రెస్​ సర్కార్​ దృష్టి సారిస్తే జిల్లా వాసులకు మేలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  జిల్లాలో ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ ఏర్పాటు చేస్తామని గత బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ హడావుడి చేసి  రెండేండ్లు కాలం వెళ్లదీసింది.  చివరికి ఎలాంటి పని మొదలు పెట్టకుండానే జిల్లా వాసులను ఆశల్లో ముంచి చేతులెత్తేసింది.  అనుకూలమైన ల్యాండ్​ వెతుకుతున్నామని బీఆర్​ఎస్​ లీడర్లు ఆ మధ్య ప్రచారం చేశారు. ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టారు.  చివరికి నాలుగు చోట్ల ల్యాండ్​ చూసి, తర్వాత ఆ మాటే మర్చిపోయారు.  

ఆశ చూపి మోసం.. 

ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ జిల్లాకు మంజూరైందంటూ   బీఆర్​ఎస్​ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​, ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు కలెక్టర్​ అనుదీప్​  దాదాపు రెండేండ్ల కిందట ప్రకటించారు. త్వరలోనే యూనిట్​ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ల్యాండ్​ సేకరించాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి.

దాదాపు 100 నుంచి 200 ఎకరాల వరకు  ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ కోసం ల్యాండ్​ అవసరం ఉంది.  ల్యాండ్​ కోసం రెవెన్యూ ఆఫీసర్లను, అప్పటి బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పరుగులు పెట్టించారు. పలు మీటింగ్​లలోనూ ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ శాంక్షన్​ గురించి చర్చించారు.  ఇందులో భాగంగానే జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, ఆళ్లపల్లి, అశ్వారావుపేట, అశ్వాపురం​ మండలాల్లో అవసరమైన స్థలాలను రెవెన్యూ అధికారులు టీఎస్​ఐఐసీ ఆఫీసర్లకు చూపించారు.  ఆయా మండలాల్లో 100 నుంచి 150 ఎకరాల ల్యాండ్​ను రెవెన్యూ అధికారులు సెలెక్ట్​ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 

యూనిట్​తో జిల్లాకు మేలు.. 

జిల్లాలో దాదాపు 11వేల ఎకరాల్లో మామిడి, దాదాపు 14వేల ఎకరాల్లో జీడి, జామ, అరటి, బొప్పాయి. సీతాఫల్​, పనస, నేరేడు వంటి పండ్ల తోటలు వేల ఏకరాల్లో సాగు చేస్తున్నారు. ఇవే కాకుండా కూరగాయల తోటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. దాదాపు 2,593 ఎకరాల్లో టమాటా, ఇతరత్రా కూరగాయలు దాదాపు 7వేల ఎకరాల్లో పండిస్తున్నారు.  

Also Read : 7 కోట్లతో కడితే.. 7 నెలలకే కుంగింది

ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​తో ప్రధానంగా పండ్ల తోటలు సాగు చేసే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. జిల్లాలో పండించిన మామిడి  హైదరాబాద్​, విజయవాడతో పాటు విదేశాలు, ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతోంది.   ఇక్కడ యూనిట్​ ఏర్పాటు చేస్తే పండ్ల వ్యాపారులకు మంచి డిమాండ్​ ఉండే అవకాశం ఉంది. జిల్లాలోని పాల్వం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్​, ఆళ్లపల్లి, అశ్వారావుపేట, అశ్వాపురం  ప్రాంతాల్లో ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్​కు సంబంధించిన ప్రతిపాధనలను టీఎస్​ఐఐసీ ఆఫీసర్లకు పంపించామని జిల్లా ఆఫీసర్లు  అంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం జిల్లాలో ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ఏర్పాటుపై దృష్టి  సారించాలని కోరుతున్నారు.