వలస కార్మికులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు యూపీ ఏర్పాట్లు

వలస కార్మికులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు యూపీ ఏర్పాట్లు

లక్నో : దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను తిరిగి తీసుకొచ్చేందుకు యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం ఇప్పటికే ఓకే చెప్పింది. దీంతో వలస కార్మికులందరినీ తిరిగి తీసుకొచ్చేందుకు ప్లాన్ రెడీ చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను కోరారు. ఇతర ప్రాంతాల్లో వలస కూలీలుగా వెళ్లిన వారిలో యూపీ వాసులే ఎక్కువ మంది ఉన్నారు. వారిని తిరిగి తీసుకొచ్చాక 14 రోజుల పాటు క్వారంటైన్ చేయాల్సి ఉంది. దీంతో క్వారంటైన్ కేంద్రాలు, వారికి భోజన సదుపాయం కోసం కమ్యూనిటి కిచెన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దాదాపు 6 లక్షల మంది యూపీ కార్మికులు తిరిగి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఎవరు తొందరపడవద్దని ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాలని ప్రభుత్వమే వారిని తీసుకొచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుందని వలస కార్మికులకు యోగీ ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు.