బెయిల్​పై విడిపించిన భార్యనే చంపేసిండు

బెయిల్​పై విడిపించిన  భార్యనే చంపేసిండు
  •     యూపీలోని బరేలీలో ఓ భర్త దారుణం
  •     నడి రోడ్డుపై నాటు తుపాకీతో కాల్పులు
  •     అక్కడికక్కడే చనిపోయిన భార్య

బరేలీ: ఉత్తరప్రదేశ్‌‌లో ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను నాటు తుపాకీతో కాల్చిచంపాడు. ఈ నెల 10న ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ  కేసులో జైలుపాలైన భర్తను బెయిల్​పై బయటకు తీసుకువచ్చిందా భార్య. ఆ తర్వాత 15 రోజులకు అదే భర్త చేతిలో చనిపోయింది. యూపీలోని బరేలీలో పశ్చిమ ఫతేగంజ్ ప్రాంతానికి చెందిన కృష్ణపాల్ లోధి (40) శనివారం సాయంత్రం ఆ ఏరియాలో రద్దీగా ఉండే మార్కెట్‌‌లో తన భార్య పూజ(32)పై పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే, నిందితుడు పూజ స్నేహితుడు మున్నా(30)పై కూడా కాల్పులు జరిపాడు. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాల్పులు జరిపిన వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అయితే, విచారణలో కృష్ణపాల్ తన భార్య తనను మోసం చేసిందని, అందుకే ఆమెను కాల్చిచంపానని చెప్పాడని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, ఆమెను చంపినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడని వెల్లడించారు. పూజ తల్లి మాట్లాడుతూ.. కృష్ణపాల్ మద్యానికి బానిసై తన కూతురిని రోజూ కొట్టేవాడని ఆరోపించింది. శనివారం కూడా మద్యంమత్తులో ఇంటికి వచ్చి పిల్లల ముందే పూజను తిట్టాడని తెలిపింది. కంట్రీ మేడ్ పిస్టల్‌‌ను బయటకు తీయగా.. పూజ భయంతో ఇంటి నుంచి మార్కెట్​వైపు పరుగెత్తిందని, ఆమెను వెంబడించి కాల్చి చంపాడని ఆమె చెప్పింది.