గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఏప్రిల్ 18న ఉదయం బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన భేతి సుభాష్ రెడ్డి.. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ పంపారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటలకు మద్దతిస్తున్నట్లు లేఖలో తెలిపారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సుభాష్ రెడ్డి. కనీసం వారికి టికెట్ ఇచ్చే ముందు తనకు మాట మాత్రం కూడా చెప్పలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లోనైనా అవకాశం వస్తుందని ఆశించాను కానీ మళ్లీ మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ను రాగిడి లక్ష్మారెడ్డికి కేటాయించారని చెప్పారు. బీఆర్ఎస్ అవకాశవాదులును గెలిపించడం కంటే.. ఉద్యమ సహచరుడు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిపించాలనుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.