హైదరాబాద్, వెలుగు: అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రొడక్ట్ డెవెలప్మెంట్ కంపెనీ వర్క్ఫ్యూజన్ హైదరాబాద్లో తన ఆఫీసును ప్రారంభించింది. హైటెక్ సిటీలోని అరబిందో ఫెసిలిటీలోని ఈ ఆఫీసులో 200 మంది పనిచేయవచ్చు. రాష్ట్ర ఐటీ & ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘15 సంవత్సరాల క్రితం అనేక ఇంటర్నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మొదలుపెట్టాయి. వాటికి సిటీపై నమ్మకం ఏర్పడింది. పెట్టుబడులను మరింత పెంచాయి. హైదరాబాద్లో బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్) సెక్టార్ బిజినెస్ భారీగా పెరిగింది.
ప్రభుత్వ సానుకూల విధానాలు, పెరుగుతున్న మౌలిక సదుపాయాలు, ట్యాలెంట్ దొరకడం వల్ల హైదరాబాద్ గ్లోబల్ కంపెనీలను ఆకర్షిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఐటీలో స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం, టాస్క్ స్కిల్ డెవలప్మెంట్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనీషియేటివ్లతోనూ వర్క్ఫ్యూజన్ కలసి పనిచేయాలి” అని ఆయన సూచించారు. వివిధ విభాగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రారంభించేందుకు నాస్కామ్తో కలిసి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తోనూ వర్క్ఫ్యూజన్ భాగస్వామ్యం ఏర్పరుచుకోవాలని జయేష్ అన్నారు.