
న్యూఢిల్లీ: మనదేశంలోని 2,600 బిలియన్ క్యూబిక్ మీటర్ల కోల్ బెడ్ మీథేన్ నిల్వలలో 10 శాతాన్ని వినియోగించుకుంటే ఇంధన దిగుమతుల బిల్లును 2 బిలియన్ డాలర్లు తగ్గించుకోవచ్చని ఎక్స్పర్టులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి రికార్డుస్థాయి ఉండటంతో మీథేన్ వినియోగంపై చర్చ జరుగుతోంది. దానిని మరింత పెంచడానికి ప్రభుత్వం ప్లాన్లు సిద్ధం చేస్తోంది. కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం)ని ఉపయోగించడానికి పరిశ్రమలు చేస్తున్న ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో దిగుమతులను తగ్గించగలుతాయని ఎక్స్పర్టులు భావిస్తున్నారు.
2022–23 సంవత్సరంలో 778.19 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి అయింది. 2025–26 నాటికి ప్రొడక్షన్ టార్గెట్ను బిలియన్ టన్నులకు పెంచుతారని, సీబీఎమ్ వాడకం పెరగడం వల్ల కాలుష్యం కూడా తగ్గుతుందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ సస్టెయినబిలిటీ యాక్షన్ ఫౌండేషన్ (ఐసీసీఎస్ఏ) హెడ్ డాక్టర్ జేఎస్ శర్మ చెప్పారు. సీబీఎంను ఎంత ఎక్కువ వాడితే ఆయిల్ బిల్లు అంత తగ్గుతుందని స్పష్టం చేశారని, దీని ప్రాముఖ్యత గురించి తమ సంస్థ అవగాహన కల్పిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా వర్క్షాప్స్ కూడా నిర్వహించామని చెప్పారు. మనదేశంలోని 12 రాష్ట్రాల్లో 2,600 బిలియన్ క్యూబిక్ మీటర్ల సీబీఎం ఉందని అంచనా.