
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం పెరగనున్న ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఇబిటా
- 5జీ ప్లాన్లతో టెలికం కంపెనీల రెవెన్యూకి బూస్ట్
- జులై 3 తర్వాత కొత్త టారిఫ్లు అమల్లోకి
న్యూఢిల్లీ: జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) రీఛార్జ్ రేట్లను యూజర్లపై అదనంగా రూ.47,500 కోట్ల భారం పడనుందని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ రిపోర్ట్ను కోట్ చేస్తూ ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. టెలికం కంపెనీలు తమ 5జీ ప్లాన్ల నుంచి రెవెన్యూ పెంచుకునేందుకు రెడీ అయ్యాయని తెలిపింది. గత రెండు రోజుల్లోనే రిలయన్స్ జియో టారిఫ్లను 13 శాతం నుంచి 27 శాతం పెంచగా, ఎయిర్టెల్ 10 శాతం నుంచి 21 శాతం వరకు, వొడాఫోన్ ఐడియా 10 శాతం నుంచి 23 శాతం వరకు పెంచింది. ఎయిర్టెల్, జియో సవరించిన రేట్లు జులై 3 నుంచి, వొడాఫోన్ ఐడియా సవరించిన రేట్లు జులై 4 నుంచి అమల్లోకి రానున్నాయి. ధరలు పెరగడంతో ఒక జియో యూజర్ రోజుకి 2జీబీ 5జీ డేటాను పొందడానికి నెలకు కనీసం రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. ముందు రోజుకి 1.5 జీబీ అందించే నెలవారీ ప్లాన్ ధర రూ.239 దగ్గర ఉండేది. టారిఫ్ ధరలను పెంచాల్సిన అవసరం ఉందని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విట్టల్, వొడాఫోన్ ఐడియా సీఈఓ అక్షయ ముంద్రా గతంలో చాలా సార్లు పేర్కొన్నారు. గ్లోబల్గా ఎక్కువ డేటా వాడే యూజర్లు ఎక్కువ చెల్లిస్తారని, ఇండియాలో కూడా అలాంటి స్టాండర్డ్స్ ఉండాలని అభిప్రాయపడ్డారు.
పెరగనున్న ఆర్పూ..
టారిప్ రేట్లు పెంచడంతో టెలికం కంపెనీ యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) పెరుగుతుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఎయిర్టెల్, జియో రోజుకి 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటాను ఆఫర్ చేసే ప్లాన్స్కు అన్లిమిటెడ్ 5జీ కనెక్టివిటీ సర్వీస్లను కల్పిస్తున్నాయి. దీనిని బట్టి 5జీ సర్వీస్ల నుంచి రెవెన్యూ పెంచుకునేందుకు కంపెనీలు రెడీ అయ్యాయని తెలుస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. భవిష్యత్లో వీటి ఆర్పూ పెరుగుతుందని అన్నారు. టారిఫ్ రేట్లు పెరగడంతో ఎయిర్టెల్ ఆర్పూ ఈ ఏడాది 11 శాతం పెరిగి రూ.209 నుంచి రూ.228 కి చేరుకుంటుందని బ్రోకరేజ్ కంపెనీ సీఎల్ఎస్ఏ ప్రకటించింది. 2026–27 నాటికి రూ.286 కి పెరుగుతుందని అంచనా వేసింది. అలానే ఎయిర్టెల్ కస్టమర్లు ఈ ఏడాది మార్చి నాటికి 35.2 కోట్ల మంది ఉండగా, 2026–27 నాటికి 37.8 కోట్లకు పెరుగుతారని వెల్లడించింది. ఎయిర్టెల్ ఆర్పూ 2026–27 నాటికి రూ.305 కి పెరుగుతుందని సిటీ రీసెర్చ్ అంచనా వేసింది. జియో ఆర్పూ ఈ ఏడాది మార్చి నాటికి రూ.206 ఉండగా, వచ్చే ఏడాది మార్చి నాటికి రూ. 223 కి పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. ఇది 15 శాతం గ్రోత్కు సమానమని తెలిపింది. వొడాఫోన్ ఐడియా ఆర్పూ ఈ ఏడాది మార్చి నాటికి రూ.146 దగ్గర ఉంది. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియాల మొత్తం ఇబిటా (ట్యాక్స్లు, వడ్డీలు ముందు ప్రాఫిట్) 2024–25 లో రూ.28,800 కోట్లు లేదా 25 శాతం పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.