అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లిస్తం: పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లిస్తం: పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

సూర్యాపేట, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పెడుతూనే.. ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గ్రామ సభల ద్వారా ఎంపిక చేసిన అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర సర్కారు డిసెంబర్ ఈ నెల 27న ప్రజలకు తీపి కబురు చెప్తుందని ఆయన వెల్లడించారు. శనివారం మంత్రి పొంగులేటి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రామస్వామి గట్టు వద్ద ఇందిరమ్మ మోడల్ కాలనీని మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డితో కలిసి సందర్శించారు. 

అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఇతర​ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. గృహ నిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంబంధిత శాఖపై అధ్యయనం చేయడానికి మొదటిసారి హుజూర్ నగర్ లో పర్యటించానని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని చెప్పారు. ప్రతి గ్రామానికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. 

హుజూర్ నగర్ మోడల్ కాలనీలో 2 వేల160 ఇండ్లును పూర్తి చేసి.. 3 నెలల్లో అర్హులకు అందిస్తామని, హుజూర్ నగర్ నుంచే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి శ్రీకారం చూడతామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం, సీతారామ మేడిగడ్డ ప్రాజెక్టులపై విచారణ చేయిస్తామని, బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 6.71లక్షల  కోట్ల అప్పు చేసిందని, ఆ డబ్బులను ఏం చేశారో కూడా చెప్పలేదన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కబ్జా భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. నిరుపేదలకు పంచుతుందన్నారు.

త్వరలోనే మహిళలకు రూ.500కు గ్యాస్​సిలిండర్: ఉత్తమ్​

త్వరలోనే మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేసి, నిరుపేదలకు ఇండ్లను ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్ నగర్ నియోజకవర్గంలో కేవలం240 ఇండ్లు మాత్రమే మంజూరు చేసిందని, అవి కూడా పూర్తిగా నిర్మాణం జరగలేదన్నారు. 

త్వరలోనే గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అవినీతి, అక్రమాలు జరగకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఎన్నికల  ముందు తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలకు కట్టుబడి ఉన్నామని, ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు.