పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ఖర్చుకు జగన్మోహన్ రెడ్డి కి కేసీఆర్ పైసలు ఇచ్చిన తమకు సంబంధం లేదని, తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేది తమ ఆందోళన అని అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా అన్యాయం జరుగుతుందని అప్పట్లో తాము పోరాటం చేశామన్నారు.
చాలా సార్లు ఇద్దరూ ముఖ్యమంత్రులు ప్రజల సొమ్ము తో కట్టిన ప్రగతి భవన్ లో సమావేశాలు జరిపారని, అప్పుడేందుకు పోతిరెడ్డిపాడు వ్యవహారం పై వారిద్దరి మధ్య చర్చ రాలేదని ప్రశ్నించారు ఉత్తమ్ . చర్చలు జరపకపోవడంలో కేసీఆర్ అసమర్థత అనుకోవాలా? లేక జగన్మోహన్ రెడ్డి తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని అనుకోవాలా? అని అన్నారు. ఖర్చు లేకుండా వచ్చే కృష్ణ నీటిని కేసీఆర్ ఏపీ కి పంపే ప్లాన్ లో ఉన్నాడని, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ కి తరలించే నీళ్లు లక్ష కోట్లు కర్చుపెట్టిన కాళేశ్వరం కంటే ఎక్కువా అని ప్రశ్నించారు.
ఇది నీ కుటుంబం వ్యవహారం కాదు… ఇది తెలంగాణ ప్రజల వ్యవహారమని సీఎం కేసీఆర్ నుద్దేశించి అన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు మొదలైతే కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.