ఉత్తరాఖండ్ సాంఘీక సంక్షేమ, రవాణా శాఖ మంత్రి చందన్ రామ్ దాస్(63) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బగేశ్వర్ జిల్లా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం (ఏప్రిల్ 26న) కన్నుమూశారు.
చందన్ రామ్ దాస్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘నా కేబినెట్ మంత్రి హఠాన్మరణం విస్మయానికి గురి చేసింది. ఆయన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. సామాజిక సేవ, రాజకీయాల్లో ఆయన లోటు పూడ్చలేనిది.' అని ధామీ ట్వీట్ చేశారు.
మంత్రి చందన్ రామ్ దాస్ మృతికి సంతాపంగా బుధవారం (ఏప్రిల్ 26) నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజులపాటు సంతాపదినాలు ప్రకటించింది. చందన్ రామ్ దాస్ 2007 నుంచి వరుసగా నాలుగుసార్లు బగేశ్వర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ధామీ కేబినెట్లోనే తొలిసారి చందన్ రామ్ దాస్ కు మంత్రి పదవి దక్కింది.