- మల్టీస్టేజ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్’తో కచ్చితమైన విశ్లేషణ
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ సెకండ్ టర్మ్ లో ఫస్ట్ ఇయర్ పాలనపై అసలు ప్రజలేమనుకుంటున్నారనే రియాలిటీని తెలుసుకునేందుకు వీ6 వెలుగు రాష్ట్రమంతటా విసృత సర్వే చేసింది. ఇండియా ఇంటెన్షన్స్ అనే సంస్థతో సంయుక్తంగా ఈ సర్వే చేపట్టింది. మొబైల్, ట్యాబ్ల ద్వారా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ను ఇందుకు వినియోగించింది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 14 వరకు రెండు వారాల పాటు సర్వే జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 112 సెగ్మెంట్లలో సర్వే నిర్వహించింది (కేవలం హైదరాబాద్లోని ఏడు సెగ్మెంట్లను మినహాయించింది). ఒక్కో నియోజకవర్గంలో 20 పోలింగ్ కేంద్రాల చొప్పున.. మొత్తం 2,240 పోలింగ్ కేంద్రాలను ఎంచుకుంది. పట్టణాలు, పల్లెలు కవరయ్యేలా ర్యాండమ్గా ఎంచుకుంది. ఈ సర్వేకు శాస్త్రీయంగా ‘మల్టీస్టేజ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్’ మెథడాలజీని అనుసరించింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయంగా భావించే విధానం ఇది. జనాభా ప్రాతిపదికన ర్యాండమైజ్డ్ రిప్రజెంటేటివ్ శాంపిల్ తీసుకుంది. 2019 జనవరి నాటికి అందుబాటులో ఉన్న ఓటర్ల లిస్ట్ ను ప్రామాణికంగా తీసుకుంది. మహిళలు, పురుషులతో పాటు వివిధ సామాజిక వర్గాలు, వివిధ వయసున్న ఓటర్లను కలుసుకొని అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 22,400 మందిని కలిసి మాట్లాడి సర్వే చేశారు. అన్ని సెగ్మెంట్ల నుంచి సేకరించిన సమాచారంతోనే ఫలితాలను రాబట్టారు. అందుకే ఈ సర్వే అందరి ఆలోచనలను ప్రతిబింబిస్తుందని.. శాస్త్రీయంగా సర్వే నిర్వహించినందున ‘మార్జిన్ ఆఫ్ ఎర్రర్’ ఒక శాతమే ఉంటుందని, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ 99% ఉంటుందని సంస్థ ప్రతినిధి వెల్లడించారు.