సింగరేణి కీలక క్యాటగిరిల్లో 2వేలకు పైగా ఖాళీలు
ఐదేండ్లుగా ఊసేలేని జూనియర్ మైనింగ్ పోస్టులు
తాజాగా 651 జాబ్ లు భర్తీ చేస్తామన్న యాజమాన్యం
నిరుద్యోగుల్లో నిరాశ
మందమర్రి, వెలుగు: సింగరేణిలో ఆరేళ్ల తర్వాత కొలువుల భర్తీకి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మార్చిలోపు 651 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సింగరేణి ప్రకటించింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నఅన్ఎంప్లాయీస్, ఇంటర్నల్ ఎంప్లాయీస్ కు సింగరేణి ప్రకటన కాస్త ఊరటనిచ్చినా పూర్తిస్థాయిలో పోస్టులను భర్తీ చేయకపోవడం నిరాశకు గురిచేస్తోంది. సింగరేణివ్యాప్తంగా వివిధ కేటగిరిల్లో సుమారు 2 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటా కార్మికుల సంఖ్య తగ్గిపోతుండగా.. సీనియర్లు, అనుభవజ్ఞులైన కార్మికులు దూరమవుతున్నారు. దీంతో కీలకమైన కేటగిరిల్లో ఉద్యోగుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో కీలకమైన సేఫ్టీ బాధ్యతలు నిర్వహించే మైనింగ్ సూపర్వైజర్స్ కొరత వందల సంఖ్యలో ఉంది. తాజాగా ప్రకటించిన పోస్టుల్లో మైనింగ్సిబ్బంది ఎంపిక ఊసే లేదు. మరోవైపు సింగరేణిలో సుమారు 700 మంది జూనియర్ అసిస్టెంట్(క్లర్కు) పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 354 మందిని భర్తీ చేస్తామని ప్రకటించింది. ఉన్నత చదువులు చదివిన వందలాది ఇంటర్నల్ ఎంప్లాయీస్ యాక్టింగ్ క్లర్కులుగా కొనసాగుతున్నారు. కేవలం 177 మందికే అవకాశం కల్పించడంతో మిగిలినవారు రెగ్యులర్అయ్యే పరిస్థితి లేకుండా పోతోంది.
వందల ఖాళీలున్నా..
గనుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ, సేఫ్టీ పూర్తిగా మైనింగ్సూపర్వైజర్స్పైనే ఉంటుంది. సింగరేణి వ్యాప్తంగా 26 అండర్గ్రౌండ్ మైన్లు, 19 ఓసీపీలున్నాయి. గనుల్లో ఒక్కో పని స్థలానికి ఒక్కో మైనింగ్సూపర్వైజర్తప్పనిసరి. షార్ట్ఫైరర్, సర్దార్, ఓవర్మెన్లుంటేనే అక్కడ పనులు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో గనిలో షిఫ్టుకు కనీసం 10 మంది ఓవర్మెన్లు, 20 మంది సూపర్వైజర్ల అవసరముంటుంది. ఇలా రోజుకు మూడు షిఫ్టుల్లో ఉంటారు. వీరు కార్మికులతో పనులు చేయించడంతో పాటు పనిస్థలంలో ఉత్పత్తి ఎంత వస్తుంది, సేఫ్టీ చర్యలు ఏ విధంగా తీసుకోవాలన్న విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ఓవర్మెన్రెండు నుంచి మూడు పని స్థలాలను పర్యవేక్షిస్తారు. సర్దార్లు ఒక పనిస్థలంలో సూపర్వైజర్లుగా పనిచేస్తే వారికి అసిస్టెంట్లుగా షార్ట్ఫైరర్లు ఉంటారు. సింగరేణి వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సుమారు 3 వేల మంది మైనింగ్సూపర్వైజర్స్అవసరముంది. అయితే ఎంప్లాయీస్ ప్రతి ఏటా రిటైర్ అవుతుండడంతో ప్రస్తుతం వీరి సంఖ్య 900కు పరిమితమైంది. వీరికి తోడు మరో 650 మంది జేఎంఈటీలు ఉన్నారు. సరైన సూపర్వైజింగ్ లేక తరచూ ప్రమాదాలు జరిగి విలువైన కార్మికుల ప్రాణాలు పోతున్నాయి. ఆరేళ్ల కిందట 650 మంది జేఎంఈటీ(మైనింగ్)లను నియమించిన యాజమాన్యం ఇప్పటివరకు మళ్లీ ఎంపిక చేయలేదు. సింగరేణివ్యాప్తంగా సుమారు 1,400 మంది మైనింగ్ సూపర్వైజర్ల కొరత ఉంది. తాజా పోస్టుల్లో ఆఫీసర్ లెవల్లో మాత్రం మైనింగ్విభాగం మేనేజ్మెంట్ ట్రైనీలో 39 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన క్షేత్రస్థాయి మైనింగ్ సూపర్వైజర్ల ఎంపికను ఆఫీసర్లు విస్మరించారని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
యాక్టింగ్ క్లర్కులకు అవకాశమేదీ!
సింగరేణి వ్యాప్తంగా మైన్స్, ఓసీపీలు, డిపార్ట్మెంట్లలో క్లర్క్ లు సుమారు 1,600 మంది సేవలందిస్తున్నారు. మ్యాన్వే, వేబ్రిడ్జి, పే షీట్, వెల్ఫేర్, స్టోర్స్, బిల్స్, పర్చేజ్, ఆర్డర్స్, కో ఆర్డినేషన్స్, సెటిల్మెంట్లు, ఆడిట్, జీతభత్యాలు, ప్రమోషన్లు, సర్వీస్తదితర రంగాల్లో వీరు పనిచేస్తుంటారు. ఒక్కోచోట ఈ పనులన్నీ ఇద్దరు లేక ముగ్గురు చేయాల్సి ఉంది. కాని యాజమాన్యం ఒక్కరితోనే నెట్టుకొస్తోంది. ప్రతి వెయ్యి మందికి సంబంధించిన పనులన్నీ కంప్యూటర్ద్వారా ఒక క్లర్కే చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. సుమారు 700 మంది వరకు క్లర్కుల కొరత ఉంది. ఉన్నత చదువులు చదివిన బదిలీ వర్కర్లు, జనరల్ మజ్దూర్కార్మికులతో పనులు చేయించుకుంటున్నారు. ఇలా సంవత్సరాల తరబడి సింగరేణిలో సుమారు 1000 మందికిపైగా యాక్టింగ్ క్లర్కులుగా పనిచేస్తున్నారు. తాజాగా 177 మంది బయటి అభ్యర్థులకు, మరో 177 మంది ఇంటర్నల్ ఎంప్లాయీస్కు జూనియర్అసిస్టెంట్లుగా అవకాశం కల్పిస్తామని కంపెనీ ప్రకటించింది. ఇన్నాళ్లుగా యాక్టింగ్ క్లర్కులుగా కొనసాగుతున్న యువ ఉద్యోగులు దీంతో నిరాశ చెందుతున్నారు. ఐదేళ్లలో కారుణ్య నియామకాల ద్వారా సుమారు 7 వేల మంది, నేరుగా 3,230 మంది యువకులు సింగరేణిలో చేరారు. మొత్తంగా యువ ఉద్యోగుల సంఖ్య 8 వేలకు పైగా ఉంటుంది. వీరిలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, డిగ్రీ, ఐటీఐ చదివినవారు దాదాపు 3 వేల మందికి పైగా ఉన్నారు. ఐఈడీ రూల్ప్రకారం క్లర్క్లను నియమించే క్రమంలో జనరల్ మజ్దూర్లను ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటే చాలా పనిభారం తగ్గే అవకాశాలున్నాయని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు ఎలక్ర్టీషీయన్, ఫిట్టర్, వెల్డర్విభాగాల్లో వందల సంఖ్యలో ఖాళీలున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ ద్వారా ఇంటర్నల్ ఎంప్లాయీస్ను ఎంపిక చేసి ఖాళీలను భర్తీ చేయాలనే డిమాండ్ కార్మిక సంఘాల నుంచి వస్తోంది.