
న్యూఢిల్లీ: అప్పుల్లో కూరుకుపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) సంస్థ, బాకీలను తగ్గించుకునేందుకు రోడ్స్టార్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) లో ఉన్న తన మిగిలిన 15 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం కొనుగోలుదారులను వెతికేందుకు యాక్సిస్ బ్యాంక్ను నియమించింది.
“రోడ్స్టార్ ఇన్విట్లో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ వాటాను అమ్మడం మా గ్రూప్ రీజల్యూషన్ ప్రణాళికలో కీలక భాగం. త్వరలోనే కన్సల్టెంట్లు, మధ్యవర్తులను నియమిస్తాం” అని ఈ కంపెనీ ప్రతినిధి తెలిపారు. రోడ్స్టార్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ యూనిట్లను ఈ ఏడాది మార్చిలో ఎన్ఎస్ఈలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ లిస్టింగ్ చేసింది.
రోడ్స్టార్ ఇన్విట్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీల) ద్వారా మొత్తం 6 రహదారి ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఇవి 685.16 కిలోమీటర్ల పొడవుతో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాల్లో ఉన్నాయి.