
రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి శోభ నెలకొంది. మట్టి వినాయకుల వైపు భక్తులు మొగ్గుచూపారు. వెరైటీ మంటపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గణపతి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. పూజాసామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.
తీరైన రీతిలో ముచ్చటగొలుపుతున్న గణనాధులు… ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. పర్యావరణానికి అనుకూలమైన ఎకో ఫ్రెండ్లీ గణేషులు ఈ సారి హల్ చల్ చేస్తున్నారు. మట్టి వినాయకులను కొలిచేందుకే ఈసారి భక్తులు మొగ్గుచూపారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల కోసం మంటపాలను వెరైటీగా తయారు చేస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గణపతి ఆలయాల దగ్గర భక్తులు బారులుతీరారు. ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామికి రుద్రాభిషేకాలు చేస్తున్నారు. చతుర్ది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుఖసంతోషాలు ప్రసాదించాలంటూ బొజ్జగణపయ్యను వేడుకుంటున్నారు.
వినాయక చవితి సందర్భంగా మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. గణేశుని పూజాసామగ్రి కోసం వచ్చిన వారితో మార్కెట్లు కిక్కిరిసాయి. పూలు, పళ్లకు గిరాకీ బాగా పెరగటంతో.. వ్యాపారులు రేట్లను అమాంతం పెంచేశారు. జంట నగరాల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు విధించారు అధికారులు.