ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబరు 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12 వరకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వార 
దర్శనం కోసం వస్తారు. జనవరి 1న గోదావరిలో తెప్పోత్సవం జరుగుతుంది. ఇందుకోసం ఒక లాంచీని హంసావాహనంగా తీర్చిదిద్దారు. 
గతంలో మాదిరి కాకుండా ఈసారి హంస వాహనాన్ని తెలుపు రంగులో తయారు చేయనున్నారు. ఇందుకోసం రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు 
ఈఈ వేగిస్న రవీందర్​రాజు తెలిపారు. ముక్కోటి ఏకాదశి పనుల కోసం రూ.1.25 కోట్లు కేటాయించారు. ఇటీవల రూ.75.99 లక్షల వర్క్స్​కు 
టెండర్లు ఖరారు కావడంతో పనులను ప్రారంభించారు. పర్ణశాల, భద్రాచలంలో అర్చీలకు రంగులు వేసే పనులు మొదలుపెట్టారు. 
ప్రధానాలయాలకు రంగులు, కరకట్టపై ఉన్న రామాయణ దృశ్య కావ్య శిల్పాలకు రంగులు వేయడం, ఇతర పనులను చేస్తున్నారు. 14 పనులకు టెండర్లు పిలిస్తే 12 పనులకు మాత్రమే టెండర్లు ఓకే అయ్యాయి. 

-  భద్రాచలం,వెలుగు

 

ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

వైరా, వెలుగు: విద్యారంగంలో పేరుకు పోయిన సమస్యలు ఐక్య పోరాటాలతోనే పరిష్కారం అవుతాయని టీఎస్  యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చావా రవి అన్నారు. స్థానిక కమ్మవారి కల్యాణ మండపంలో నిర్వహించిన టీఎస్  యూటీఎఫ్  ఖమ్మం జిల్లా మహాసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యారంగ సమస్య ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని, ఏడేండ్లుగా ప్రమోషన్స్, ఐదేండ్లుగా బదిలీలు లేక ఉపాధ్యాయులు మనోవేదనకు గురవతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఎల్ఎన్  పేరుతో ప్రైమరీ స్కూల్​ టీచర్లను బోధనకు దూరం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలను సక్రమంగా ఇవ్వడం లేదని అన్నారు. 317 జీవోతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జీవీ నాగమల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా  పారుపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా బుర్రి వెంకన్న, యూసఫ్ షమీ, కోశాధికారిగా వల్లంకొండ రాంబాబు, కార్యదర్శులుగా ఎ సుధాకర్, ఎస్కే రంజాన్, ఎం నరసయ్య, కె గీత, జీఎస్ఆర్  రమేశ్ ఎన్నికయ్యారు. 

ఆసరా పెన్షన్లు విడదల చేయాలి

వైరా, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల నుంచి ఆసరా పెన్షన్​ డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని  ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, మహమ్మద్ గౌస్  డిమాండ్​ చేశారు. సోమవారం వైరాలోని విశ్రాంతి భవన్​లో సమావేశం నిర్వహించారు. కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బత్తుల అంజలి, ప్రధాన కార్యదర్శిగా కనకాంబరం, సహాయ కార్యదర్శిగా సంగేపు ఆదినారాయణ, గౌరవ​అధ్యక్షుడిగా వేముల సాంబశివరావు ఎన్నికయ్యారు. 

మత్స్యకారులకు అండగా ఉంటా

వైరా, వెలుగు: మత్స్యకారులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే రాములు నాయక్ చెప్పారు. సోమవారం మధిర రింగ్ రోడ్ లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.  మత్స్యకారులకు ఎలాంటి ఆర్థిక సహకారమైనా అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వ్యక్తిగత లోన్లు, టూవీలర్లు, వలలు ఇవ్వడంతో పాటు బీమా సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. వైరా రిజర్వాయర్ మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు షేక్ రహీం, బొర్రా రాజశేఖర్, జైపాల్, సీతారాములు, మిట్టపల్లి నాగేశ్వరరావు, రాజశేఖర్, షేక్  బీబాసాహెబ్,  పణితి సైదులు, మోటపోతుల సురేశ్​​పాల్గొన్నారు.

ఆదివాసీలకు అన్యాయం చేస్తున్రు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆదివాసీలకు ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్  అన్యాయం చేస్తున్నారని మాజీ ఎంపీ మిడియం బాబూరావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు. అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ సంరక్షణ నియమాలు–2022ను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. అటవీ ప్రాంతాల్లోని భూములను కార్పొరేట్లకు కట్టబెడుతూ ఆదివాసీలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఆవునూరి మధు, అన్నవరపు కనకయ్య, రమణాల లక్ష్మయ్య, భుక్యా శ్రీనివాస్, కల్లూరు వెంకటేశ్వరరావు, దనసరి రామ్మూర్తి, కోటేశ్వరరావు, రాయల చంద్రశేఖర్, మాచర్ల సత్యం, నిర్మల, సతీశ్, సురేందర్​ పాల్గొన్నారు.

ఎఫ్​సీఐని నిర్వీర్యం చేస్తున్రు

పెనుబల్లి, వెలుగు: దేశంలో ఆహార ధాన్యాలను సేకరించాల్సిన ఎఫ్​సీఐని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. మండలంలోని వియం బంజర్​లో సోమవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు ధరణి పోర్టల్​తో వచ్చినవి కావని, గతంలో ఉన్న సమస్యలకే ఇప్పుడు పరిష్కారం చూపుతున్నామన్నారు. డీఆర్డీవో విద్యాచందన, జడ్పీటీసి చెక్కిలాల మోహన్​రావు, సర్పంచ్​ పంతులి, టీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, లక్కినేని వినీల్, ప్రసాద్, సురేశ్​​ పాల్గొన్నారు. 

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రీవెన్స్​లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్​ అనుదీప్​ ఆదేశించారు. కలెక్టరేట్​లో సోమవారం గ్రీవెన్స్​లో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు వాటిని అందజేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అడిషనల్​ కలెక్టర్​ కె వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక్​ చక్రవర్తి పాల్గొన్నారు. 

గ్రీవెన్స్ లో వినతుల వెల్లువ

ఖమ్మం టౌన్: ఖమ్మం సిటీలోని జడ్పీ హాల్ లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే అడిషనల్ కలెక్టర్ ఎన్  మధుసూధన్  అర్జీలను తీసుకున్నారు. 60 మంది డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డ్స్, దళితబంధు, రైతు బంధు, ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, మిగిలిన40 అప్లికేషన్స్ ధరణి సమస్యలపై వచ్చాయి. అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఆర్వో శిరీష, ఆర్డీవో రవీంద్రనాథ్​ పాల్గొన్నారు.

పోడు సమస్యలు గ్రామసభల్లో పరిష్కరించుకోండి

భద్రాచలం: పోడు సమస్యలను గ్రామసభల్లో పరిష్కరించుకోవాలని ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు సూచించారు. ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్​లో వివిధ మండలాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు సమస్యల పరిష్కారం కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ గిరిజన కుటుంబానికి ప్రభుత్వ పథకం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏపీవో జనరల్​ డేవిడ్​రాజ్​, డీడీ రమాదేవి, ఎస్​వో సురేష్​బాబు, డీటీ ఆర్​ఓఎఫ్​ఆర్​ శ్రీనివాస్​ పాల్గొన్నారు.

కంప్లైంట్​లు రాకుండా చూసుకోవాలి

గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్​ విభాగం ద్వా రా చేపడుతున్న పనులపై ఎలాంటి ఫిర్యాదులు రాకుం డా చూసుకోవాలని పీవో ఆదేశించారు. తన చాంబర్​లో సోమవారం ఆయన ఇంజనీర్లతో సమావేశమై పనులపై సమీక్ష చేశారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా డిజైన్లు ఉండాలని ఆదేశించారు. స్గూడెంట్స్​కు ఇబ్బంది కలగకుండా రిపేర్లు చేపట్టాలన్నారు. డీఈలు, ఏఈలు వారి పరిధిలో ఉన్న స్కూల్స్​ను సందర్శించి రిపేర్లు చేపట్టాలని సూచించారు. చీఫ్​ ఇంజనీర్​ శంకర్, ఈఈ తానాజీ, డీఈ రాములు పాల్గొన్నారు.

రమేశ్​కు సంగీత రత్న అవార్డు

ములకలపల్లి, వెలుగు: మండలకేంద్రానికి చెందిన ప్రైవేట్  ఆల్బమ్  మ్యూజిక్  డైరెక్టర్  గంట రమేశ్​కు సంగీత రత్న అవార్డు దక్కింది. ఆదివారం హైదరాబాద్​లో ఆల్ ది బెస్ట్  ఆర్ట్ అకాడమీ 17వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ స్టేట్  హ్యూమన్  రైట్స్  కమిషనర్  జస్టిస్ డాక్టర్ జి చంద్రయ్య, తెలంగాణ హైకోర్టు జడ్జి ఎస్ నంద అవార్డును అందజేశారు. 

సమస్యలపై కలెక్టరేట్​ ఎదుట ఆందోళనలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్​ ఎదుటు పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఆశ్రమ పాఠశాలలు, గిరిజన హాస్టల్స్​లలో పని చేస్తున్న డైలీ వేజ్​ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ట్రైబల్​ స్కూల్స్, హాస్టల్స్​ డైలీ వేజ్​ వర్కర్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు మంగీలాల్, సెక్రటరీ భద్రయ్య డిమాండ్​ చేశారు. కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేసి నినాదాలు చేశారు. ఆందోళనకు న్యూడెమోక్రసీ, బీఎస్పీ నాయకులు నాగేశ్వరరావు, సారంగపాణి, యెర్రా కామేశ్​​మద్ధతు ప్రకటించారు. అలాగే 3 నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ తెలంగాణ మిషన్​ భగీరథ కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయిస్​ అండ్​ వర్కర్స్​ యూనియన్​ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ఎదుట నిరసన తెలిపారు. యూనియన్​ జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకన్న, ప్రధాన కార్యదర్శి ముల్క నరేశ్ పాల్గొన్నారు. పాత కొత్తగూడెం ఏరియాలో ఏర్పాటు చేసిన డంపింగ్​ యార్డ్​ నుంచి వస్తున్న దుమ్ము, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని ఆ ప్రాంత వాసులు కలెక్టరేట్​ ఎదుట ఆందోళన చేశారు. జె ప్రదీప్​కుమార్, నాగభూషణం పాల్గొన్నారు. 

ప్రజలను మోసం చేస్తున్రు

కొత్తగూడెం పట్టణ ప్రజలకు తాగునీటిని ప్రతి రోజు సప్లై చేస్తానని చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మరిచి పోయారని బీఎస్పీ స్టేట్​ జనరల్​ సెక్రటరీ యెర్రా కామేశ్​​ విమర్శించారు. నీటి ఎద్దడిని నివారించాలని, మంచినీటిని సప్లై చేయాలని డిమాండ్​ చేస్తూ కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేపట్టారు. పట్టణంలో తాగు నీటి ఎద్దడి నివారణకు రూ.130 కోట్లతో ప్రపోజల్స్​ పంపామని ఎమ్మెల్యే ఏడేండ్లుగా చెబుతున్నారని విమర్శించారు. జిల్లా ఇన్​చార్జి గంధం మల్లికార్జునరావు, గుడివాడ రాజేందర్, కె. శేషయ్య, జె ఆనందరావు, మల్లేశ్​​ పాల్గొన్నారు.

దళిత బంధు కోసం కవర్ల ఉద్యమం

ఎర్రుపాలెం,వెలుగు: మండలంలోని దళితులు కవర్ల ఉద్యమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే సిఫారసుతో దళితబంధు అందిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆఫీసుకు నేరుగా దళితబంధు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తులతో కూడిన కవర్లను పంపిస్తున్నారు. ఇలా కవర్లు పంపించాలని కొందరు జిరాక్స్ వ్యాపారులు దళితులకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.