
- ఇంటి నంబర్లు కేటాయించి అమ్మకాలు, కొనుగోళ్లు
- బరితెగిస్తున్న అక్రమార్కులు..సహకరిస్తున్న సబ్రిజిస్ట్రార్లు
- నిషేధిత జాబితాలో ఉన్నా.. బాజాప్తా రిజిస్ట్రేషన్లు
- దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ లీడర్లు
- తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయక ప్రజలు
- వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి, చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న ముఠాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్, వక్ఫ్భూములను ఆక్రమించి, వాటిని గజాల్లోకి మార్చి, ఇంటి నంబర్లు కేటాయించి బాజాప్తా అమ్మేస్తున్నారు. ఈ అక్రమాలకు రాష్ట్రంలోని సబ్ -రిజిస్ట్రార్ కార్యాలయాలే వేదికగా మారుతున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సబ్రిజిస్ట్రార్ ఆఫీసర్లే దగ్గరుండి మరీ రిజిస్ట్రేషన్లు చేయిస్తుండగా, మున్సిపల్, రెవెన్యూ ఆఫీసర్లు తమ వంతు సహకరిస్తున్నారు. వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకుని రోజురోజుకూ పెచ్చుమీరుతున్న ఈ దందాలో డాక్యుమెంట్ రైటర్లు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ప్రధానంగా ఉంటున్నారు.
ప్రభుత్వ భూములకు పక్కన ఉన్న ప్రైవేటు భూములనుకొనడం, ఆ తర్వాత సర్కారు జాగాలను ఆక్రమించి, వెంచర్లు చేసి విక్రయిస్తున్న ఘటనలు సైతం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఇలా వేన వెంచర్లలో ప్లాట్లు కొన్న అమాయక ప్రజలు నిండా మునుగుతున్నారు.
నిషేధిత భూముల్లోనూ రిజిస్ట్రేషన్లు!
రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్ లిస్ట్)లో ఉన్న భూముల్లో కూడా యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, ఫారెస్ట్, ఎండోమెంట్ భూములు, పోరంబోకు భూములను రెవెన్యూశాఖ ‘నిషేధిత జాబితా’లో ఉంచుతుంది. అంటే, ఈ భూములను అమ్మడానికి లేదా కొనడానికి వీల్లేదు. కానీ..సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నిషేధ జాబితాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. దీంతోపాటు మొన్నటి వరకు ధరణి, ఇప్పుడు భూ భారతి వంటి వ్యవస్థల్లో ఉన్న లోపాలు కూడా వీరికి కలిసివస్తున్నాయి. దీనివల్ల నిషేధిత జాబితాలో ఉన్న భూములను సైతం చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. సాధారణంగా వ్యవసాయ భూములు నిషేధిత జాబితాలో ఉంటే.. ఆ సర్వే నెంబర్లలో భూ భారతిలో స్లాట్ బుక్ చేసేందుకు అవకాశం ఉండదు. అంటే, ఆ భూములను అమ్మాలన్నా, కొనాలన్నా రిజిస్ట్రేషన్లు జరగవు. ఆ సర్వే నెంబర్ బ్లాక్లో ఉండడంతో రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుక్ చేసేందుకు ఆప్షన్ కూడా ఉండదు. కానీ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం పక్కాగా అమలు కావడం లేదు. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లలో కూడా కొందరు డాక్యుమెంట్ రైటర్లు, అధికారుల సాయంతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెందిన కోట్ల రూపాయల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ సర్వే నెంబర్ పక్కనే ఉన్న సర్వే నెంబర్ ఎంట్రీ చేసి.. ప్రభుత్వ భూమిలోనే ఇంటి నెంబర్ తీసుకుని నిర్మాణాలు చేపట్టి, రిజిస్ట్రేషన్చేయించుకుంటున్నారు.
లోపాల పుట్టలుగా సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాలు
సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాలు లోపాల పుట్టలుగా తయారుకావడమే అక్రమ రిజిస్ట్రేషన్లకు ప్రధాన కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నిషేధిత జాబితాలోని భూములను ఆటోమేటిక్గా బ్లాక్ చేసే ఆన్లైన్ సిస్టమ్ సక్రమంగా లేకపోవడం, కొన్నిసార్లు కావాలని నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని అంటున్నారు. సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొందరు అధికారులు, సిబ్బంది కూడా ఈ అక్రమాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలు బయటపడినప్పుడు సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లను సస్పెండ్చేసి చేతులు దులుపుకొంటున్నారు. 2, 3 నెలలకే వారు మళ్లీ డ్యూటీలో చేరి ఎప్పట్లాగే అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. నిజానికి అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘‘రిజిస్ట్రేషన్ చట్టం, 1908’’కి సవరణలు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం ఒకసారి రిజిస్టర్ అయిన ఆస్తిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. కేవలం కోర్టులు మాత్రమే రద్దు చేయగలవు. కానీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగానికి ఈ అధికారాన్ని అప్పగిస్తూ ఏపీ, తమిళనాడులాంటి రాష్ట్రాలు ఇప్పటికే సవరణలు చేశాయి. రాష్ట్రంలోనూ సర్వే నెంబర్ను బ్లాక్ చేయడంతోపాటు వెంటనే రద్దు చేసేలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగానికి అధికారాలు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
అటు అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టడానికి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆధునిక సాంకేతిక వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లు, భూమి స్వభావాన్ని ఆన్లైన్లో పరిశీలించే సదుపాయం, డిజిటల్ డేటాబేస్ను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా.. ప్రతి ఇంటికి, స్థలానికి కూడా వ్యవసాయ భూముల తరహాలో పట్టా బుక్ అమలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దీంతోపాటు తప్పుడు పత్రాలు సృష్టించే వారిపై, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకట్ట వేయచ్చని చెబుతున్నారు. కానీ ఆ దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. నిషేధిత జాబితాలో ఉన్న ప్లాట్లకు, ఇండ్లకు ఎలాంటి చట్టపరమైన హక్కులు లేకపోవడంతో అక్రమార్కుల నుంచి భూములు కొనుగోలు చేసిన అమాయకులు నష్టపోతున్నారు.
అసెస్మెంట్ నంబర్లే వజ్రాయుధం
అక్రమార్కులకు అసెస్మెంట్ నంబర్లే వజ్రాయుధంగా మారుతున్నాయి. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీ లో ఫేక్ అసెస్మెంట్ నంబర్లు సృష్టించి కోట్ల ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో పాత భవనాలు ఉన్నట్లు రికార్డు సృష్టించి.. వాటికి గతంలోనే ఇంటి నంబర్లు ఉన్నట్లు అసెస్మెంట్ నంబర్ ఇచ్చి దాని ద్వారా లీగల్ గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకుంటున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో మళ్లీ ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఆదిలాబాద్లో ప్రభుత్వ భూమిని అమ్మేసిండు..
ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామానికి చెందిన సర్వే నంబర్170 లోని ప్రభుత్వ భూమిలో ఓ వీఆర్వో ఇటీవల తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రూ. కోటి విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. 30x40 గజాల విస్తీర్ణంతో ప్లాట్లు చేసి.. 8 మందికి విక్రయించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించాడు. ఈ స్థలంలో ఎలాంటి ఇండ్లు లేనప్పటికీ మున్సిపల్ యంత్రాంగం ఇంటి నంబర్లు కేటాయించింది. ఆ తర్వాత సబ్రిజిస్ట్రార్ గుడ్డిగా రిజిస్ట్రేషన్చేశారు. కొంతమంది ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా, ఆయన ఆదేశాల మేరకు విచారణ చేసిన రెవెన్యూ సిబ్బంది.. అక్రమాలు నిజమే అని తేల్చారు. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కోరుతూ తాజాగా రిజిస్ట్రేషన్శాఖకు లేఖ రాశారు.
గద్వాత్వల మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమిలో ప్లాట్లు
గద్వాల మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని సర్వేనెంబర్ 91 లో అర ఎకరా ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి పక్కనే ఉన్న ఒకరు ఆ 20 గుంటలను తన భూమిలో కలిపేసుకొని వెంచర్వేశాడు. అందులో సుమారు 10 నుంచి 12 ప్లాట్లను ఇతరులకు అమ్మి, వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ వ్యవహారంలో ఆఫీసర్లకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయనే ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా రాఘవేంద్ర కాలనీలో వక్ఫ్ ల్యాండ్ ఉన్నదని చెప్పి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. దాదాపు కోటి రూపాయల విలువైన ప్రాపర్టీని ఎలాంటి డాక్యుమెంట్ లేకుండానే రిజిస్ట్రేషన్ చేయడం కలకలం రేపుతున్నది.
శంషాబాద్లో నకిలీ కోర్టు ఉత్తర్వులు సృష్టించి..
శంషాబాద్లో వేల కోట్ల విలువైన 100 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన అక్రమార్కులు ఏకంగా నకిలీ కోర్టు ఉత్తర్వులు సృష్టించారు. ఫోర్జరీ ఉత్తర్వులతో అటు న్యాయ వ్యవస్థను, ఇటు రిజిస్ట్రేషన్ విభాగాన్ని తప్పుదోవ పట్టించాలని చూశారు. శంషాబాద్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నకిలీ ఉత్తర్వులను సమర్పించి, భూమిని తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న అక్రమార్కుల ప్రయత్నాలకు హైకోర్టు తాజాగా బ్రేక్వేసింది. పిటిషనర్లు సమర్పించిన కోర్టు ఉత్తర్వులు నకిలీవని తేలడంతో నిందితులపై కేసు నమోదుతో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణకు ఆదేశించడం గమనార్హం.