
- డిపార్ట్మెంట్ల వారీగా లక్ష్యాలు కేటాయింపు
- గ్రామ నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు
- భారీ వర్షాలు పడగానే నాటేందుకు ప్రణాళికలు
మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనం పెంచేందుకు ఉద్ధేశించిన వన మహోత్సవానికి మెతుకు సీమ సిద్ధమవుతోంది. కార్యక్రమంలో భాగంగా ఈ ఏడు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,03,63,750 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాల వారీగా చూస్తే మెదక్ జిల్లాలో 37,10,100, సంగారెడ్డి జిల్లాలో 34,05,850, సిద్దిపేట జిల్లాలో 22,47,800 మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాలను కేటాయించారు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు.
అనేక రకాల మొక్కలు..
వన మహోత్సవంలో నాటేందుకు నర్సరీల్లో నీడను, గాలిని ఇచ్చే మొక్కలతో పాటు, ఫలాలు ఇచ్చే మొక్కలను పెంచుతున్నారు. నేషనల్, స్టేట్ హైవేలు, గ్రామీణ రహదారుల వెంట, చెరువు గట్ల మీద, ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్, గురుకులాలు, కాలేజీలు, హాస్టల్స్ ప్రాంగణాల్లో ఎలాంటి మొక్కలు నాటాలనేది నిర్దేశించారు. ఇంటి పరిసరాల్లో నాటేందుకు అనువైన మొక్కలను సైతం నర్సరీల్లో పెంచుతున్నారు. సరిపడ వర్షాలు కురిసి అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడు వన మహోత్సవాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి వన మహోత్సవం విజయవంతం చేయడంపై దిశానిర్దేశం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో..
వన మహోత్సవం ద్వారా సిద్దిపేట జిల్లాలో 22 లక్షల 47 వేల 800 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్టూడెంట్స్, స్వచ్ఛంద సంస్థలు మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను తీసుకుంటున్నారు. మెదక్, ఎల్కతుర్తి జాతీయ రహదారికి ఇరువైపులా, జనగామ నుంచి దుద్దెడ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా నీడనిచ్చే మర్రి, రావి, చింత, వేప, మహాగని, ఇప్ప తదితర మొక్కలతో పాటు పండ్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు.
ప్రభుత్వ బడులు, గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో కరివేపా, మునగా, ఉసిరి, చింత మొక్కలను నాటనున్నారు. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా అవకాశం ఉన్న ఇంటి ఆవరణలు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.