బిహార్ లో ట్రైనింగ్ పొంది.. లోన్స్ పేరిట తెలంగాణలో దోపిడీ

బిహార్ లో ట్రైనింగ్  పొంది.. లోన్స్ పేరిట తెలంగాణలో దోపిడీ
  • సైబర్​ నేరస్తుడిని అరెస్టు చేసిన వనపర్తి పోలీసులు

వనపర్తి,కొత్తకోట, వెలుగు: రెండు రాష్ట్రాల్లోని ప్రజలను నమ్మించి ఇండియా బుల్స్ / ధని, ముద్ర లోన్స్ పేరిట నాలుగేండ్లుగా దోచుకుంటున్న నిందితుడు అరెస్ట్ అయ్యాడు. కొత్తకోట సీఐ రాంబాబు తెలిపిన ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి ముందరి తండాకు చెందిన కిషన్​తన తమ్ముడి ద్వారా బిహార్​లోని పట్నాకు వెళ్లి సైబర్​నేరాలు ఎలా చేయాలో శిక్షణ పొందాడు. అక్కడే కొన్ని నెలల పాటు సైబర్​నేరాలు చేసి వనపర్తికి వచ్చాడు. రెండేళ్లుగా సైబర్​నేరాలకు పాల్పడుతున్నాడు. బాధితుల ఫిర్యాదుతో పెద్దమందడి మండలానికి చెందిన ఎనిమిది మంది ముఠాను   గత ఆగస్టు 29న అరెస్టు చేశారు.  

గురువారం మరో నిందితుడు ముడావత్​రమేశ్​​ను, శుక్రవారం ఇంకో నిందితుడు కిషన్ ను అరెస్టు చేసి  ఇండ్ల ప్లాట్లు డాక్యుమెంట్లు, ఒక మారుతి బ్రెజా కారు, పాస్​పోర్టు, వివిధ బ్యాంకుల అకౌంట్ బుక్స్​, సెల్​ఫోన్లు, కీ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.  ఇతడు తన తండావాసులకు కూడా సైబర్​ నేరాలపై శిక్షణ ఇవ్వగా.. వారంతా  పాట్నా, దిల్లీ, కోల్​కతా, వనపర్తిలో ఆఫీసులు తెరచి సైబర్​నేరాలకు పాల్పడుతున్నారని త్వరలోనే పట్టుకుంటామని సీఐ వివరించారు.  జిల్లా ఎస్పీ గిరిధర్  అధ్వర్యంలో  కొత్తకోట ఎస్ ఐ  మంజునాథ్ రెడ్డి, శ్రీ రంగాపూర్ ఎస్ ఐ వెంకటేశ్వర్లు,   జిల్లా సైబర్ సెక్యూరిటీ ఇన్ చార్జి డీఎస్పీ ఎన్​బీ  రత్నం  కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.