
- ఈ కంపెనీలకు అప్పులిచ్చిన వారికీ రిస్కేనన్న వైస్రాయ్
- 6 శాతం పడిన వేదాంత లిమిటెడ్ షేర్లు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన షార్ట్-సెల్లర్ (షేర్లు లేదా బాండ్లు పడతాయని బెట్ కట్టే కంపెనీ) వైస్రాయ్ రీసెర్చ్ బుధవారం (జులై 09) వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ (ముంబై బేస్డ్ వేదాంత లిమిటెడ్ పేరెంట్ కంపెనీ) (వీఆర్ఎల్)ను "ఆర్థికంగా నిలదొక్కుకోలేని, అప్పులిచ్చినవారికి పెద్ద రిస్క్" అని 85 పేజీల రిపోర్ట్లో ఆరోపించింది. వీఆర్ఎల్ డెట్ (బాండ్లను) స్టాక్ను షార్ట్ చేస్తున్నట్లు చెప్పింది.
షార్ట్ సెల్లింగ్ అంటే బాండ్లను అరువు తీసుకొని, ప్రస్తుత ధరలో విక్రయించి, తర్వాత తక్కువ ధరకు కొని లాభం పొందడం. ఈ రిపోర్ట్ తర్వాత వేదాంత లిమిటెడ్ (వీఈడీఎల్) షేర్లు 6శాతం పడ్డాయి. చివరికి 3.54 శాతం లాస్తో రూ.440.05 వద్ద ముగిశాయి. వీఆర్ఎల్ని "పరాన్నజీవి"గా వైస్రాయ్ అభివర్ణించింది. ఇది వీఈడీఎల్ నుంచి నగదును తీసుకొని తన 4.9 బిలియన్ డాలర్ల రుణ భారాన్ని మేనేజ్ చేస్తోందని, దీనివల్ల వీఈడీఎల్ ఎక్కువ రుణాలు తీసుకోవాల్సి వస్తోందని ఆరోపించింది. ఫలితంగా ఈ కంపెనీ నగదు నిల్వలు క్షీణిస్తున్నాయని తెలిపింది.
‘‘వీఈడీఎల్ వాల్యూ పడిపోతోంది. ఈ కంపెనీకి అప్పులిచ్చిన వారు నష్టపోతారు. ఇది "పోంజీ స్కీమ్" లాంటిది. వీఆర్ఎల్ ఆర్థికంగా సస్టైనబుల్ కాదు. కార్యకలాపాలను సరిగ్గా జరపడం లేదు. రుణదాతలకు తీవ్ర రిస్క్’’ అని వైస్రాయ్ తెలిపింది. వీఈడీఎల్ ఆస్తుల విలువలను ఎక్కువగా చేసి చూపడం, భరించే స్థాయిలో లేకపోయినా క్యాపిటల్ ఎక్కువగా అవసరముండే ప్రాజెక్ట్లను ప్రకటించి ఫ్రెష్గా ఫండ్స్ సేకరించడం, ఈ ఫండ్స్ను పేరెంట్ కంపెనీకి పంపడం వంటివి చేస్తోందని ఆరోపించింది.
అలానే ఈ కంపెనీ బిలియన్ల డాలర్ల వివాదాస్పద ఖర్చులను బ్యాలెన్స్ షీట్లో చూపడం లేదని, ఆడిటర్ ఎంపికలో వైఫల్యాలు ఉన్నాయని పేర్కొంది. వీఆర్ఎల్ డీమెర్జర్ ప్లాన్ కూడా నగదు సమస్యలను పరిష్కరించలేదని, కొత్త ఎంటిటీలపై రుణ భారం మోపుతుందని చెప్పింది.
ఆధారాల్లేకుండా ఆరోపణలు: వేదాంత
వేదాంత ఈ రిపోర్ట్ను "కుట్రపూరితం, నిరాధారం" అని, పబ్లిక్లో ఉన్న సమాచారాన్ని సంచలనాత్మకంగా చూపించి మార్కెట్ను ప్రభావితం చేయాలని చూస్తున్నారని ప్రకటించింది. రిపోర్ట్ విడుదలకు ముందు తమను సంప్రదించలేదని, తమ కార్పొరేట్ ప్రణాళికలను అడ్డుకునేందుకు దీనిని విడుదల చేశారని తెలిపింది. వైస్రాయ్ ఎక్స్లో స్పందిస్తూ, వేదాంత తమ రిపోర్ట్ను తిరస్కరించినా, దాన్ని ఖండించలేకపోయిందని, తమ ఆరోపణలు సరైనవని
పేర్కొంది.