బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ మాసెస్ అనేది ట్యాగ్లైన్. శ్రుతిహాసన్ హీరోయిన్. వరలక్ష్మీ శరత్కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చాయి. శుక్రవారం ‘జై బాలయ్య’ అనే మాస్ సాంగ్ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. నిన్ను తలచుకున్న వారు.. లేచి నిల్చొని మొక్కుతారు.. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా.. అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా’ అంటూ సాగిన పాట హీరో పాత్రని ఎలివేట్ చేస్తోంది.
మాస్ లీడర్గా వైట్ అండ్ వైట్లో బాలయ్య ఆకట్టుకున్నారు. ‘తిప్పు సామీ కోర మీసం.. తిప్పు సామీ ఊరి కోసం.. నమ్ముకున్న వారికోసం.. అగ్గి మంటే నీ ఆవేశం.. నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా’ అంటూ నందమూరి ఫ్యాన్స్లో జోష్ నింపేలా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. అంతే జోష్ఫుల్గా కరీముల్లా పాడాడు. ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు తమన్ సైతం వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్లో తనదైన డ్యాన్స్ మూమెంట్స్తో ఇంప్రెస్ చేశాడు. శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. చుట్టూ జనాల మధ్య దేవాలయాలు, పచ్చని పల్లె పరిసరాలలో ఈ పాటని చిత్రీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.