టెర్రస్, బాల్కనీల్లో గార్డెనింగ్ చేయడం, కూరగాయల మొక్కల్ని పెంచడం తెలిసిందే. కానీ, కార్ల రూఫ్ మీద కూడా వెజిటబుల్స్ పెంచుతున్నాయి థాయిలాండ్ క్యాబ్ కంపెనీలు. రోడ్ల మీద తిరగాల్సిన కార్ల మీద ‘మినియేచర్ గార్డెన్’ ఎందుకు పెంచుతున్నారో తెలుసా...
కరోనా టైం మొదలైనప్పటి నుంచి మన దగ్గరే కాదు అంతటా క్యాబ్ల జోరు తగ్గింది. పొద్దంతా తిరిగినా ఒక్క సవారీ కూడా దొరకడం లేదు. దాంతో, చాలా క్యాబ్ కంపెనీలది డ్రైవర్లకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మరికొన్నేమో బ్యాంకు లోన్లు కట్టలేని సిచ్యుయేషన్లో ఉన్నాయి. థాయిలాండ్లో ‘రత్చప్రక్’, ‘బొవొర్న్’ అని ట్యాక్సీ కంపెనీలు ఉన్నాయి. ఈ రెండూ ట్యాక్సీ కంపెనీలకి మూడు వేల క్యాబ్లున్నాయి. లాక్డౌన్ ఎత్తేశాక వీటిలో ఐదొందల క్యాబ్స్ మాత్రమే రోడ్డెక్కాయి. మిగతా కార్లన్నీ పార్కింగ్లాట్లోనే ఉండిపోయాయి. అలా ఊరికే పడి ఉన్న ఆ కార్ల మీద ‘మినియేచర్ గార్డెన్’ పెంచితే కూరగాయల ఖర్చులు మిగులుతాయనే ఐడియా వచ్చింది వాళ్లకి.
కార్ల రూఫ్ మీద, బ్యానెట్ మీద వెదురు కర్రల్ని డబ్బా షేప్లో పేర్చారు. దాని మీద చెత్త సేకరించే నల్లని ప్లాస్టిక్ బ్యాగులు వేశారు. వాటి మీద మట్టి చల్లి, టొమాటో, దోసకాయ, బీన్స్ వంటి కూరగాయల మొక్కల్ని పెంచుతున్నారు. అలా పెంచిన వెజిటబుల్స్ స్టాఫ్కి ఇస్తున్నారు.
స్టాఫ్కి సాయం చేసేందుకు
“ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకుంటే మేం మరింత కష్టాల్లో పడతాం. ట్యాక్సీ–టాప్ గార్డెన్తో ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేయడమే కాకుండా ఈ కష్టకాలంలో మా స్టాఫ్కి సాయం చేస్తున్నాం. ఈ గార్డెనింగ్ చేయడం మాకు వేరే రాబడి కోసం మాత్రం కాదు. థాయిలాండ్లో గతంలో రాజకీయంగా ఎన్నో మార్పులు వచ్చి ఎకానమీ దెబ్బతింది. 2011లో భారీ వరదలు వచ్చాయి. కానీ, ఎప్పుడూ మా బిజినెస్ ఇంతలా దెబ్బతినలేదు. కరోనా మాత్రం పెద్ద దెబ్బ కొట్టింది ” అన్నాడు రత్చప్రక్ ఎగ్జిక్యూటివ్ థపకొర్న్.