- నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కూకట్పల్లి/సికింద్రాబాద్, వెలుగు: ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోనే 5 కిలోల గోల్డ్, 3 కిలోల వెండి పట్టుబడింది. మంగళవారం రాత్రి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఎన్ఆర్ ఎంపైర్ బిల్డింగ్ ఎదురుగా ముంబై హైవేపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మియాపూర్నుంచి కూకట్ పల్లి వైపు వెళ్తున్న కారును ఆపి సెర్చ్ చేయగా..అందులో అక్రమంగా తరలిస్తున్న 3.193 కిలోల గోల్డ్, 3.569 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. ఎటువంటి ఆధారాలు, డాక్యుమెంట్స్ చూపకపోవటంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న నాచారానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్(27), కుత్బుల్లాపూర్కు చెందిన బీరేంద్రసింగ్(54), ఉప్పల్కు చెందిన విజయ్కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సికింద్రాబాద్లో 2 కిలోలు..
సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2 కిలోల బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. పోలీసులు మంగళవారం స్వప్నలోక్ కాంప్లెక్సు వద్ద తనిఖీ చేపట్టారు. ఓ వాహనాన్ని చెక్చేయగా అందులో 20 బంగారు బిస్కట్లు(2 కిలోలు) ఉన్నాయి. వెహికల్లో ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద బంగారానికి సంబంధించిన సరైన రశీదులు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. పట్టుబడిన గోల్డ్ ను సనత్నగర్ రిటర్నింగ్ అధికారికి అప్పగించనున్నట్లు డీసీపీ చందనా దీప్తి పేర్కొన్నారు.
బాచుపల్లిలో రూ.2 కోట్ల విలువైన చీరలు పట్టివేత
జీడిమెట్ల, వెలుగు: హైదరాబాద్ బాచుపల్లిలోని పంచవటి అపార్ట్మెంట్ లో రూ.2కోట్ల విలువైన చీరలు పట్టుబడ్డాయి. అక్రమంగా పెద్ద ఎత్తున చీరలు డంపింగ్ చేస్తున్నారని ఫ్లైయింగ్ స్వ్కాడ్కి సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు.. ఫైయింగ్ స్వ్కాడ్తో కలిసి అపార్ట్ మెంట్ వద్దకు వెళ్లారు. అక్కడ రెండు లారీల్లో ఉన్న చీరలను పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. అపార్ట్మెంట్లోని బ్లాక్ 7డీ డబుల్ బెడ్రూమ్ నుంచి 400 బ్యాగులు, అసోసియేషన్ ఆఫీసు గది నుంచి 343 బ్యాగులు మొత్తం 743 బ్యాగులు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న చీరల విలువ రూ.2.25 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకే ఈ చీరలను తీసుకెళ్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.