భారత్ జోడో యాత్ర..జడ్చర్ల హైవేపై  ట్రాఫిక్ జామ్ 

భారత్ జోడో యాత్ర..జడ్చర్ల హైవేపై  ట్రాఫిక్ జామ్ 

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతోంది. అన్ని వర్గాల ప్రజలు యాత్రలో పాల్గొంటూ రాహుల్ కు మద్దతు తెలుపుతున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం జడ్చర్లలో  రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  జడ్చర్ల నుంచి కొత్తూరు వరకు వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో 5వ రోజు రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. జడ్చర్ల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. గొల్లపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర రాజాపూర్, బాలానగర్ మీదుగా.. అన్నారం గేట్, షాద్ నగర్ వరకు కొనసాగనుంది. బాలానగర్ జంక్షన్ దగ్గరున్న అయ్యప్పస్వామి టెంపుల్ దగ్గర మార్నింగ్ బ్రేక్ ఇవ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు బాలానగర్ జంక్షన్ దగ్గర నుంచి తిరిగి యాత్ర ప్రారంభం కానుంది.  ఏడు గంటలకు షాద్ నగర్ బైపాస్ దగ్గరున్న అన్నారం గేట్ వద్ద రాహుల్ మాట్లాడనున్నారు. షాద్ నగర్ దగ్గరున్న ఫరూక్ నగర్ లో నైట్ హాల్ట్ ఏర్పాటు చేశారు. మొత్తం 22 కిలోమీటర్లు సాగనుంది రాహుల్ యాత్ర. 

శనివారం 20.3 కిలోమీటర్లు నడిచారు. మహబూబ్ నగర్ టౌన్ నుంచి జడ్చర్లలోని రాజాపూర్ వరకు పాదయాత్ర కొనసాగింది. భారత్ జోడో యాత్రలో భాగంగా జడ్చర్లలో నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసే పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజల ఉసురు పోసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన నల్లచట్టాలకు సీఎం కేసీఆర్ మద్దతిచ్చారని తెలిపారు.